Wednesday, 6 September 2017

కవనతరంగిణి.......


మిథున కవితా వనం సభ్యులకు 


ఏభైమూడేళ్ళపాటు ఎత్తిన కలం దించకుండా కవిగా విమర్శకునిగా ఉపన్యాసకుని గా నూతన తరాల సాహిత్యకారులను ఉత్సాహపరచిన నిరంతర సాహిత్య సంచారి అద్దేపల్లి రామమోహనరావు, తన 80వ ఏట కన్నుమూసేదాకా, తన ‘ప్రాణాన్ని’ సాహిత్య సామాజిక ప్రగతికి దోహదం కావటమే ‘ ముట్టని అరుదైన సాహిత్యకారులలో ఒకడు అద్దేపల్లి. ‘మధుజ్వాల’తో పద్యాన్ని కూడా వదిలి భావ వ్యక్తీకరణ సౌలభ్యమైన వచన కవిత ప్రక్రియలోకి ప్రవేశించాడు. అయితే ‘ఒకప్పుడు, కవిత్వాన్ని మాత్రమే ప్రేమించినపుడు, గోదావరి నన్నయ పద్యాల్లా శ్రీనాధుడి సీసాల్లా కనపడింది. ఇపుడు జీవితాన్ని కూడా అర్ధంచేసుకున్నప్పుడు, దోవ పొడుగునా పోరాటాల్ని మోసుకుపోతున్న పరమాణు ప్రవాహం కనిపిస్తోంది’ అని చెప్పుకున్న అద్దేపల్లి ‘సాంఘిక పురోగమనానికి ఉపయోగపడే ఏ కవితారేఖ కనిపించినా దాన్ని హృదయానికి హత్తుకునే వాడు సామ్యవాది’ అని భావించి ఆచరించినవాడు.

 

కొప్పర్తి అన్నట్టు ‘‘అద్దేపల్లి ప్రధానంగా స్థూల స్థాయి కవి (Macro Level Poet)’. అందుకు మినహాయింపులు లేకపోలేదు. ‘పాలకవర్గాల రధం ఆగితే నెడతారు, సాగితే తిడతారు’ అని ప్రగతిశీల శిబిరంలోపల గల వొక విమర్శకు సాక్ష్యంగా ‘ఇందిరమ్మకు భజనచేసే’ వారిపై 1972లో అద్దేపల్లి రాసినపాట ఆనాడు అనేకానేక వేదికలపై గానంగా వినిపించేది. కాంగ్రెసువారి నడుమ ఆధిపత్యపోరులో ఇందిరాగాంధీ దేశీయ విధానాలనే కాదు, పొరుగు దేశాల (సిక్కింను కలిపేసుకోవటం, బంగ్లాదేశ్‌ను ఏర్పరచటం)లో జోక్యాన్ని కూడా సమర్ధించి, ఆమెకు జవ, జీవాలను కల్పించి, అత్యవసర పరిస్థితిని కూడా కొందరు ఆహ్వానించిన కాలంలో అద్దేపల్లి రాసిన పై పాట చాలా ప్రత్యేకతను పొందింది. ఇందిరాగాంధీ అంటే ‘దేశీయ కమ్యూనిజం’ అన్నట్లు ఆమెకు మద్దతు యిచ్చినవారిని ఎద్దేవా చేస్తూ ‘పేదవారికి పెద్దవారికి, భేదమికపై నశిస్తుందని, ఇంద్రజాలంలోన మునిగీ ఎదురు తిరిగే దమ్ములేనపుడు- ఏమి చెయ్యాలేమిచెయ్యాలీ, జనులారమీరు ఇందిరమ్మకు భజనచెయ్యాలి’ అని అద్దేపల్లి గొప్ప వ్యంగ్యవైభవాన్ని ప్రదర్శించాడు. ‘సమాజానికి ఎప్పుడూ వొక పురోగమన వేగముంటుంది. దానితో పాటు పరిగెత్తగలిగినపుడు, అది యౌవనం’ అన్నాడు అద్దేపల్లి. తెలుగు సాహిత్యంపై బలంగా ప్రసరించిన సామాజిక ధోరణుల ప్రభావాల నన్నిటినీ, అవి వస్తు, రూప సంబంధమేదైనా, తనలో నింపుకుని కాలంతోపాటు నడిచి నిత్యయౌవనుడుగా జీవించినవాడు అద్దేపల్లి.

 

దళితులపై సాగుతోన్న దోపిడీ పీడనల్ని ‘మేకల్నే బలిస్తారు’ అనే కవిత ద్వారా వ్యక్తీకరిస్తూ ‘మేకలన్నీ సింహాలై యూపస్తంభాన్నూపే రోజొస్తుంది’ అంటాడు. యూపస్తంభం అంటే యజ్ఞంలో బలిపశువును కట్టివుంచేది. ఇపుడు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనా విద్యార్థి వేముల రోహిత్‌ను బలిపశువుగా చేసిన అగ్రవర్ణ ఆధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రతిఘటనోద్యమం - పైన అద్దేపల్లి చెప్పిన వాక్యాలై కాలంతోపాటు పరుగిడుతున్నాయి.

 

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం సాగుతున్న దంతా, హిందువులకూ - హిందూయేతరులకూ; దళితులకూ - దళితేతరులకూ నడుమ సంఘర్షణలాగా చిత్రించాలనీ ఆవిధంగా మైనారిటీలనూ, దళితులనూ ఒంటరిగాళ్ళుగా మిగల్చాలనే ఆధిపత్య వర్గాల ప్రచారమొకటి నడుస్తోంది. హిందుత్వశక్తులు కోరుకునేదిదే. ‘హిందూత్వ’ శక్తుల రాజకీయం హిందూ మతస్తులకోసం కాదనీ, దానికొక వర్గస్వభావముందనీ అద్దేపల్లి ఎప్పుడో గుర్తించాడు.

 

‘హిందూత్వం, అమెరికనిజాన్ని 
నెత్తిన కిరీటంగా పెట్టుకుని 
మైనారిటీ ద్వేషమొక్కటే హిందూత్వమని 
విభిన్నముఖాల మధ్య చెట్లు కూలగొట్టి 
ఎడారుల్ని పరుస్తోంది 

ఓ! హిందూత్వమా! నువ్వు నిజానికి అమెరికనిజానివా?’’

 

అంటూ హిందూత్వవాదుల కుహనా దేశభక్తిని అద్దేపల్లి బట్టబయలు చేశాడు. ‘‘మేకల దారి ఎప్పుడూ ఒక్కటే! సింహాల వేటలో ఒడుపులు మాత్రం అనేకం’’ అంటూ ‘అంబేద్కర్‌ మొదలుపెట్టిన వాక్యాన్ని పూర్తిచేద్దాం’ అంటూ కులనిర్మూలన పిలుపుని కొనసాగించమని అద్దేపల్లి నొక్కి చెప్పాడు. అయితే నిచ్చెనమెట్ల కులవ్యవస్థనీ, శ్రమజీవుల తరతరాల దారిద్రాన్నీ మతంపేరిట, దేవునిసాకున బలపరుస్తున్న హిందూమతాన్ని అడుగడుగునా ఎదుర్కొనకుండా కులనిర్మూలన సాధ్యంకాదని ప్రవచించిన అంబేద్కర్‌ను తమ పూజనీయుడుగా మార్చుకుంటున్నట్లు అడ్డగోలుగా ప్రవర్తించే హిందూత్వ రాజకీయాలది ఆత్మవంచనా, పరవంచన తప్ప మరేమవుతాయి?

 

25 ఏళ్ళ నుండి ఉదార, సరళీకృత ఆర్ధిక సంస్కరణలపేరుతో అమలుజరుగుతున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ద్వారా 2020వ సంవత్సరంనాటికి బంగారు భారతం నిర్మాణమవుతుందనీ, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికే నూతన ఆర్ధిక విధానాలనీ పాలక రాజకీయ పార్టీలూ, ముఠాలూ... వారి ప్రచార బాకాలైన మీడియా, మేధావులూ ఊదరకొట్టారు. కానీ ప్రపంచ, భారతదేశ వ్యాపితంగా సంపద కొద్ది కుటుంబాల వద్దకు చేరి కోట్లాదిగా దరిద్రుల సంఖ్యను పెంచుతోంది. దావోస్‌ (స్విట్జర్లాండ్‌)లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ప్రవేశపెట్టిన నివేదిక పెరుగుతున్న ఆర్ధిక వ్యత్యాసాలను ప్రకటించక తప్పలేదు. 40 వేల కోట్ల రూ. ఆస్తులున్న స్టీఫెన్‌ కెల్లికే అనే సంపన్నుడే భారీ వ్యాపారాలున్న కొద్దిమందికి మాత్రమే ఆ సదస్సులో స్థానం దక్కినందుకు నిరసనగా దాన్ని బహిష్కరించాడు. అంతకంటే ప్రపంచ సంపద కేంద్రీకరణ తీరుకి నిదర్శనమేమి కావాలి? 2010లో ప్రపంచ జనాభాలో సగంమంది సంపదకు సమానమైనది 388 మంది కుబేరుల దగ్గర పోగుపడి వుంటే, మరుసటి సంవత్సరం 177 మంది ప్రస్తుతం కేవలం 62 మంది వద్దా అది పోగుపడింది. అదే భారతదేశంలో కూడా 2014లో ఒక్క బిలియన్‌ డాలర్ల (6800 కోట్ల రూపాయల) సంపన్నులు 61 మంది నుండి ఒక్క సంవత్సరంలో వారు 100 మందిదాకా పెరిగారు. ఇదే కాలంలో ఈలాంటి సంపన్నులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన రాయితీలు 5 లక్షల కోట్ల రూపాయలు. ఇవన్నీ ప్రపంచీకరణ విషఫలితాలే. ఈలాంటి సామ్రాజ్యవాద ప్రపంచీకరణను ప్రధానంగా సాంస్కృతిక కోణం నుండి అద్దేపల్లి తీవ్రంగా గర్హిస్తూ ప్రశ్నిస్తూ గత 20 ఏళ్ళుగా రాసి, ప్రసంగించారు.

 

‘దేశమంటే నల్లమట్టికాదోయ్‌, దేశమంటే తెల్లమనుషులోయ్‌’ అనీ ‘పాలకులు పరదేశాల పాలేర్లుగా మారారనీ’ వాడు ‘చెట్టుకింద నుంచి నేలను లాగేస్తున్నాడనీ’ హెచ్చరికలు చేసిన అద్దేపల్లి ‘యుద్ధం చెయ్యడానికి, జాతి వెన్నెముకని ఖడ్గంగా మారుస్తున్నాను. మట్టిలో వేళ్ళని దేశమంత లోతుగా పాతిపెడుతున్నాను’ అన్నారు.

 

సామ్రాజ్యవాదయుగంలో, ప్రపంచీకరణకాలంలో, అద్దేపల్లి ప్రకారం ‘ప్రాణమయమైన అక్షరాన్ని, ప్రాణాలులేని యంత్రాలు వేటాడతై’ ‘పెద్ద పెద్దవాళ్ళ పండగ సందేశాలన్నీ తెలుగు కత్తితో ఇంగ్లీషునీ, ఇంగ్లీషు కత్తితో తెలుగునీ ఖూనీచేస్తూ వుంటై’. అంతేకాదు ‘వాడి భాషామంత్రాక్షరాలతో ఇక్కడి పాలకులందర్నీ హిప్నటైజ్‌ చేసి తన మొక్కను పెంచే సమర్ధతనిస్తున్నాడు’. ఆ మొక్క పేరు ఇంగ్లీషు భాష.

 

సామ్రాజ్యవాదుల పెదపాలేర్లయిన మన పాలకులకు భక్తి ప్రపత్తు లెక్కువై, యజమానులు కూడా చిరాకుపడే విద్యావిధానాలను అనుసరించి, ఇంగ్లీషు వ్యామోహాన్ని పెంచి యిటు తెలుగు రాని అటు ఇంగ్లీషు కూడా రాని చదువులు నేర్పిస్తున్నారు. మాతృభాషా హంతకులై నారు. తెలుగుద్వేష పాలకులైనారు. వీరి తయారీలో ఇంజనీర్లయిన వారిలో నూటికి ఎనభైమంది తమకూ, తమ కుటుంబానికీ, సమాజానికీ పనికిరాని వాళ్ళయినారు.

 

లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంవారు ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమల్లో 233 పాఠశాలల్లోని విద్యార్థుల పరిజ్ఞానాన్ని కొన్ని సంవత్సరాలు పరిశోధించి తెలుగు మాధ్యమంలో చదువుకునే విద్యార్థులు ఇతర అంశాలేకాక ఇంగ్లీషు నైపుణ్యం కూడా ఎక్కువ సాధించగలుగుతున్నారని నిర్ధారించారు. యజమానులు చెప్పుదెబ్బలు కొట్టినా వీడని బానిసభక్తి మన పాలకులది. పరాయి భాషామాధ్యమంలో చదువులు ఆశాసీ్త్రయమని మనం గత 25 ఏళ్ళకుపైగా బల్లగుద్ది చెబుతున్నదానినే యిపుడు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంవారు నిర్ధారించారు. ఇంగ్లీషు భాషతో వ్యాపారంచేసి కోట్లకు కోట్లు గడించే అవకాశాలను మన పాలకులు అంత తేలికగా వదులుకుంటారని నమ్మలేం!

మాతృభాషలు దెబ్బతిని కునారిల్లే పరిస్థితులపట్ల ఆవేదన చెందే వారినుద్దేశించి అద్దేపల్లి వ్యంగ్యంగా ‘‘వీడొకడు! మాతృభాష, మాతృభాష అంటాడు. తుపానుకి గునపాలు కొట్టుకు పోతుంటే గడ్డిపరకలు ఏడుస్తున్నట్లుంది’’ అన్నారు. దీని తాత్సర్యమేమంటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు చరమగీతం పాడకుంటే దేశానికీ, వివిధ జాతుల ప్రజలకూ వారి భాషలకూ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలూ, విముక్తీలేవు. అలాగే అద్దేపల్లి ఆశకు, పొగచూరిన ఆకాశానికి శాంతీలేదు. మనది సర్వసత్తాక లౌకిక గణతంత్ర సమతారాజ్యమని చెప్పుకోవటానికి అర్హతా లేదు.

No comments:

Post a Comment