Saturday, 30 December 2017

గజల్..2016--అందమెంతో..

చిత్రకవితా మంజరి...తెలుగు గజల్...రచన.డా. శ్యామలగడ్డం.....28.12.2016...
+++++++++++++++++++++++++++++++

జాబిలమ్మతొ  ముద్దుమోమూ  పంతమాడిన  అందమెంతో

ఆకసమ్ము తొ  నీలివసనము  ఆటలాడిన   అందమెంతో

పిల్లతెమ్మర  వాతెరల్లో  ధవళకాంతుల. సందడెంతో

కలువకన్నుల   వీక్షణములతొ.  నిరీక్షించిన.  అందమెంతో

మయూరాన్నే   చెలిగ చేసీ.  రాసియుండిన   లేఖలెన్నో

ప్రియుని చేరా   రాయబారిగ   చేసియుండిన   అందమెంతో

వియోగాలా.  జలధిలోనా  తీరమెక్కడ. తెలియకున్నా

మరులు గొలిపే.  లేఖలెన్నో.  రాసియుండిన   అందమెంతో

శ్యామ తెలిపే   ఊసులన్నీ. కొంటెకృష్ణుని   చిలిపిచేష్టలు

తొందరించిన   మనసునెంతో    ఆపియుండిన  అందమెంతో..

.

డా. శ్యామలగడ్డం....28-12-2016....

+++++±++++++++++++++++++++++++++

గజల్....2015..నెచ్చెలీ

గజల్ కాన్వాస్-- 38--- నెచ్చెలీ...28-12-2015-----డా. శ్యామలగడ్డం

కలలలోన తేలియాడు సమయమేలె నెచ్చెలీ
రెప్పలేమొ బరువాయెను నిదురలేదె నెచ్చెలీ

మరుని రూపమగుపించెగ మదియె పులకరింతకాగ
మరునిముషము కానరాక కలవరమె నెచ్చెలీ

తానురాక తనవంతున లేఖలెన్నొ పంపినాడు
జాబిలియే జారవిడుచు వెన్నెలాయె నెచ్చెలీ

సుమశరుడే సంధించిన బాణమేను మదినితాక
విరహానల వేగుచుంటి..దయచూపడె నెచ్చెలీ

ప్రతిక్షణమొక యుగముగాను సాగుచుండె తాపముతొ
తుషారముగ తాకగాను తాను రాడె నెచ్చెలీ

డా. శ్యామలగడ్డం......

Friday, 29 December 2017

కవనతరంగిణి.........

మిథున కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో శనివారం
వచ్చేస్తుంది.. శనివారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........

ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...

రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...

మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను

సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2018 శుభాకాంక్షలతో.....కవనతరంగిణికి స్వాగతం....2018, కొత్త సంవత్సరంలో,
ఆశల వలువలు  చుట్టుకొని, ఆశయాల ఆమనిలో , సంకల్పమే సాధనంగా  లక్ష్యమనే తీరాలను చేరాలని  మనసారా కోరుకుంటూ.....ఈ వారం కవనతరంగిణికి మరొక్కసారి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం...

"కవిత్వమంటే పందిరి మీదకు ద్రాక్షతీగను పాటించడం, పద్మవ్యూహం లోంచి బయటపడే ప్రయత్నం చేయడం, పియానో మెట్లమీద సమ్మోహనరాగ జలపాతాలను దూకించడం."...అంటారు దేవీప్రియ...

సుప్రసిద్ధ కవి జర్నలిస్టు దేవీప్రియ రచించిన గాలి రంగు కవితాసంపుటికి 2017 సంవత్సరంలో  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం ముదావహమైన విషయం.నాలుగున్నర దశాబ్దాలుగా కవిత్వాన్ని వాహికగా చేసుకొని మంచి కవిత్వాన్ని వెలయి స్తున్నారు.....

దేవీప్రియ గారి అసలుపేరు షేక్ కాజా హుస్సేన్.గుంటూరు జిల్లా వాస్తవ్యులు..‌..దేవీ ప్రియ కలం పేరుతో   అరణ్యపురాణం,  అమ్మచెట్టు, నీటిపుట్ట, గరీబుగీతాలు, పిట్టకూడా ఎగిరిపోవాల్సిందే మొదలైన కవితా సంపుటులను వెలువరించారు.

కవిత్వాన్ని అతి సామాన్యంగా, అసామాన్యం గా చెప్పగలిగే కవి.

"నడిస్తే మదపుటేనుగు లా నడవాలి/ నవ్వితే మొనాలిసాలా నవ్వాలి/రాస్తే కాళిదాసు లా రాయాలి/ గీస్తే పికాసో లా గీయాలి/ పుడితే మా అమ్మకడుపున పుట్టాలి/ కవిగా అచ్చంగా నాలాగానే పుట్టాలి"/ అంటారు దేవీ ప్రియ......

ఇలాంటి గొప్ప కవులను ఆదర్శంగా తీసుకుని కవిత్వరచన చెయ్యవలసింది గా కోరుతున్నాను...

ఈ వారం నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ....

కవితలుగానీ, పద్యాలు కానీ...పైన తెలిపిన ఏ ప్రక్రియలో నైనా మీ రచనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించవచ్చును..

లేదంటే మీకు ఇష్టమైన ఏ వస్తువునైనా గ్రహించి రచనలు చేయవలసిందిగా మనవి...

కవనతరంగిణిని నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన అడ్మిన్ లీల గారికి ధన్యవాదాలతో, సభ్యులందరికీ శుభాకాంక్షలతో....

అడ్మిన్,

డా.శ్యామల గడ్డం.

(29-12-2017)30-12-2017...

Wednesday, 13 December 2017

పాల్కురికి సోమన...

మతపరిస్థితులు: సాహిత్యం సామాజిక జీవన ప్రతిబింబ మని విజ్ఞుల భావం సామాజిక పరిస్థితుల్ని బట్టి సాహిత్య దృక్పథం కూడా పరిణామం చెందుతూ ఉంటుంది. ప్రాచీన సాహిత్యం ఎక్కువ భాగం మత దృక్పథంతోనే వెలువడింది. సమాజంలో జైన బౌద్ధాల ప్రభావం మితిమీరిపోయినపుడు వైదిక మత పునరుద్ధరణ కోసం పంచమ వేదంగా నన్నయ మహాభారతాన్ని రచించాడు. కాకతీయులు మొదట జైనులుగానే ఉండి తర్వాత బసవడు స్థాపించిన వీర శైవ మతాన్ని అనుసరించారు. పాల్కురికి వేద ప్రమాణాల్ని నిరసిస్తూ, వీరశైవం వేద విహితమైనదని తన రచనల్లో చెప్పాడు.
వీర శైవ మతము: వీరశైవులు, తక్కిన శైవ సంప్రదాయాల కన్న వైదిక మతాన్ని ఎక్కువగా నిరసించారు. వీర శైవం సంఘ సంస్కరణకు నాంది పలికింది. కుల విధానాన్ని వ్యతిరేకించింది. శూద్రులకు పంచములకు కూడా కావ్య గౌరవం కలిగించింది. స్త్రీ, పురుషుల సమానత్వాన్ని చాటి చెప్పింది. వీర శైవ కవుల్లో అగ్రగణ్యుడు పాల్కురికి. శివుణ్ణి పరమదైవంగా భావించే మతం శైవం. శైవులు 'ఏక ఏవరుద్రో' అని శివుడొక్కడే దేవుడని చాటుతారు. శివుడు సగుణ నిర్గుణ పరబ్రహ్మ. కాశీ యందు విశ్వేశ్వరుడు శ్రీశైలమందు మల్లికార్జునుడు, హిమాచలమందు గౌరీశంకరుడు. ఈ శైవాలయాలు శైవ వ్యాప్తిని తెలియజేస్తున్నాయి. శివునికి ఇతరులు సరిరారని సోమన ''శంకర దాసయ్య'' కథలో పేర్కొన్నాడు.
బసవేశ్వరుడు కర్ణాటక దేశంలో వీరశైవమును స్థాపిస్తే ఇతని చరిత్రను మొదట తెలుగులో బసవపురాణంగా పాల్కురికి సోమనాథుడు రచించగా తరువాత ఇది కన్నడములోనికి భాషాంతరీకరణ పొందింది. అదేవిధంగా పండితారాధ్య చరిత్ర కూడా కన్నడ భాషలోనికి తెలుగు నుండే ప్రయాణము చేసింది. శివకవుల మతావేశమునకు ఉదాహ రణగా బసవ పురాణములో ఒక సంఘటనను ఉదహరిం చవచ్చును. శివభక్తుడైన భృంగి ఒకమారు శివుని దర్శింప బోయెను. ఆ సమయంలో శివుడు పార్వతీ సమేతుడై ఉండగా శివునికి మాత్రమే నమస్కరించి భృంగి వెనుదిరిగి పోయెనట. శివునికే తప్ప ఇతరుల ముందు శిరస్సు వంచని మతావేశము వీరిది. పైవిధంగా సోమనాథుని రచనలు వీరశైవ మత స్వరూపం మత విద్వేషాలు, మత సంప్ర దాయాలు ప్రతిఫలిస్తూ ఆనాటి మత పరిస్థితుల్ని అవగాహన చేసుకొనుటకు దోహదమౌతున్నాయి. జాతి బేధాలకు ఏ మాత్రం తావివ్వని వీరశైవమతాన్ని పాల్కురికి సోమన అనుసరించాడు.