Thursday, 29 December 2016

1. గజల్....29-12-2016.

గజల్ పూరణం.... డా. శ్యామలగడ్డం..29-12-2016
++++++++++++++++++++++++

భూదేవికి.  పచ్చకోక  కట్టాలని   ఉన్నదిలే
వానజల్లు పుడమిబాట పట్టాలని ఉన్నదిలే

కడలిలోన లోతుయెంతొ తెలుసుకునే తొందరలో
అలలలోన అందమెంతొ చూడాలని ఉన్నదిలే

కొమ్మలోని కోయిలమ్మ గళమెత్తీ కూయగాను
రాగాలే.  రసధునులై.  పాడాలని   ఉన్నదిలే

వసంతమే వసనముగా వనమునందు నింపేసెను
పల్లవించు    కోరికలే.  తీరాలని.   ఉన్నదిలే

నీలిమేఘ శ్యాముడే కరిమబ్బుగ మారినేడు
భూమాతను తనివితీర తడపాలని ఉన్నదిలే....

డా. శ్యామలగడ్డం....29- 12- 2016...

Wednesday, 28 December 2016

2 గజల్ జాబిలమ్మతొ......28-12-2016...

చిత్రకవితా మంజరి...తెలుగు గజల్...రచన.డా. శ్యామలగడ్డం.....28.12.2016...
+++++++++++++++++++++++++++++++

జాబిలమ్మతొ  ముద్దుమోమూ  పంతమాడిన  అందమెంతో

ఆకసమ్ము తొ  నీలివసనము  ఆటలాడిన   అందమెంతో

పిల్లతెమ్మర  వాతెరల్లో  ధవళకాంతుల. సందడెంతో

కలువకన్నుల   వీక్షణములతొ.  నిరీక్షించిన.  అందమెంతో

మయూరాన్నే   చెలిగ చేసీ.  రాసియుండిన   లేఖలెన్నో

ప్రియుని చేరా   రాయబారిగ   చేసియుండిన   అందమెంతో

వియోగాలా.  జలధిలోనా  తీరమెక్కడ. తెలియకున్నా

మరులు గొలిపే.  లేఖలెన్నో.  రాసియుండిన   అందమెంతో

శ్యామ తెలిపే   ఊసులన్నీ. కొంటెకృష్ణుని   చిలిపిచేష్టలు

తొందరించిన   మనసునెంతో    ఆపియుండిన  అందమెంతో..

.

డా. శ్యామలగడ్డం....28-12-2016....

+++++±++++++++++++++++++++++++++

Friday, 23 December 2016

3. గజల్ కళ్ళలో దాగాలని...22-12-2016

గజల్ పూరణం...రచన డా. శ్యామలగడ్డం....22-12-2016
+++++++++++++++++++++++++++++++

కళ్ళల్లో దాగాలని  కన్నీళ్నకు ఎలా తెలుసు
ముళ్ళల్లో దాగాలని పుష్పాలకు ఎలాతెలుసు

ముత్యంగా మారాలని వానచినుకు అనుకుందా?
ఉప్పెనగా ముంచానని కెరటాలకు ఎలా తెలుసు

తామరపై బిందువుగా నిలవాలని కోరిందా
తుంపర గా కురియాలని మేఘమునకు ఎలాతెలుసు

బోసినవ్వు చిందించే పసిపాపల కేరింతలు
మురిపాలను పంచాలని పసివయసుకు ఎలాతెలుసు

మనసులోతు తెలియనిదే మైత్రి ఎలా నిలువగలదు
శ్యామ తెలుపు మదిలోతులు నేస్తాలకు ఎలా తెలుసు

Wednesday, 14 December 2016

4. గజల్..14-12-2016...7 మాత్రలు

చిత్రకవితా మంజరి...14-12-2016....రచన. డా. శ్యామలగడ్డం...

నీవు నేనుగ కలసిపోయిన మధురగీతం పాడనా
పూవులోనీ తావినంటిన మంచిగంధం కురవనా

గాలిలోనా తలలువూపే కొమ్మతో సయ్యాటలాడ
మనసులోనా ఊయలూగే వీణనాదం పలుకనా

మంచు పల్లకి నెక్కినీవూ గగనమందూ విహరించగా
మురిసిపోయే నదినినేనై జలధిఅందం చూడనా
మరువలేనీ ప్రేమ విరులు కురిసి విరిసే వింతగా
మమతదరులా జ్ఞాపకాలుగ ప్రేమ బంధం కూర్చనా

వీడిపోయిన తీగబంధం మరల అల్లిక సాగునా
శ్యామ యెదలో పొంగిపోయే భావగీతం రాయనా

డా. శ్యామలగడ్డం..14-12-2016....

Sunday, 11 December 2016

అత్త గజల్..11-12-16

చామంతి పువ్వల్లే విరబూసి నవ్వింది మా అత్త
సిరి మల్లె పువ్వల్లే స్వఛ్ఛంగ నవ్వింది మా అత్త

సుఖమైన, దుహ్ ఖమైన ఒకటే తీరుగ నుండునులే
విరబూసిన  మందారమోలే. నవ్వింది మా అత్త

మాటతో, నవ్వుతో మనమనసూ గెలుస్తుంది
మంచువోలే  తడియారనీ సుమమేలే. మా అత్త

ప్రేమతోను, లాలనతోడ గీతా  మారుస్తుందీ
పద్మములో లక్ష్మి లా  చిన్నగ నవ్వింది మా అత్త

మురళీ మనోహరిగా.   విశ్వమంతా ఆనందంగా
శ్యామలముతొ తిరుగుతు  హాస్యంగ నవ్వింది మా అత్త

డా. శ్యామలగడ్డం.... నల్గొండలో  ఉన్న మా అత్తపైన గజల్.....

Friday, 9 December 2016

తెలుగుగజల్..,09.12-2016

గజల్ పూరణం..20..రచన. డా. శ్యామలగడ్డం...09-12-2016..

అందమైన గజలు విన్న రసానందం పొంగుతూ ఉంటుంది
శృతిలయలు గానముతొ జతకూడి రాగసుధ చిలుకుతూ ఉంటుంది

మౌనములే మనిషిని మహనీయునిగా తీర్చిదిద్దు సాధనాలు
మంచితనం దేవతైన మనసు దీపమై వెలుగుతూ ఉంటుంది

సప్తవర్ణాల హరివిల్లు తానుగా మెరిసెనే మబ్బులొ రాణిగ
నిండు పున్నమిరేయి  ధారలుగా అమృతము వంపుతూ ఉంటుంది

మేఘాల మాటునా రేరాజు దొంగాటలాడుతూ ఉంటాడు
తారకయె రారాజు యేడనీ వెతలతో వెతుకుతూ ఉంటుంది

సప్తాశ్వ రధముపై దినకరుడు పయనమూసాగించ
తూరుపున ఆకసము నునుసిగ్గు దొంతరలు నింపుతూ ఉంటుంది...

డా. శ్యామలగడ్డం...09.12-2016...

Saturday, 3 December 2016

యానాం కవిత్వోత్సవము...

యానాం కవితోత్సవం నవంబర్ 26,27రెండు రోజులు అధ్భుతంగా జరిగింది. Department of culture & arts govt of puducheri, భాషా సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి సౌజన్యంతో కవిసంధ్య స్ఫూర్తి సాహిత్య సాంస్కృతిక సంస్థలు యానాం సంయుక్త ఆధ్వర్యంలో కవితోత్సవం జరిగింది.

ప్రముఖ అభ్యుదయవాదకవి కీ.శే. ఆవంత్స సోమసుందర్ ప్రాంగణంలో న్యాయానికి నిలువుటద్దమైన బొజ్జా తారకంవేదిక సభా స్థలిగా యానాం కవితోత్సవం కన్నుల పండువగా జరిగింది.
++++±++++++++++++++++++++++++++++++++

26 శనివారం ఉదయం 10 గంటల సమయంలో సభ ప్రారంభమయింది.ఈ సదస్సులో మాన్యశ్రీ మండలి బుధ్ధప్రసాద్ గారు ప్రముఖ కవి శివారెడ్ఢి గారు ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ప్రముఖ కవి కవిసంధ్య సంపాదకులు శిఖామణి గారు ఆహ్వానసంఘం అధ్యక్షులు శ్రీ దాట్ల దేవదానంరాజు గారు కవి ఆకెళ్ళ రవి ప్రకాష్ గారు మొ.. వేదిక పై ఆసీనులయ్యారు..

తెలుగు భాష సంస్క్శతులను నిలబెట్టవలసిన బాధ్యత కవులపైనే ఉన్నదనీ ప్రభుత్వాన్ని మంత్రులనూ ఈవిషయమై మందలించే హక్కున్నదనీ మండలి బుధ్ధప్రసాద్ గారు అన్నారు. కవి శివారెడ్ఢి గారు తన కీలకప్రసంగంలో కవిత్వమంటే ఏమిటి ఏవిధంగా ఉండాలి?మానవనాగరికతలో కవిత్వం దారేదీ అని చర్చించారు..

శ్రీ కొలకలూరి ఇనాక్ గారు మాట్లాడుతూ కవులు రచయితలు ఈసభకు పెద్దఎత్తున రావడం ఆనందదాయకమన్నారు. ప్రముఖ చిత్రకారులు శీలా వీర్రాజుగారి చిత్రకళాప్రదర్శన సభలో చోటుచేసుకోవడం వలన కవిత్వోత్సవమే కాదు వసంతోత్సవంకూడా అయ్యింది.

సమకాలీన భారతీయ కవిత్వము... జాతీయ సదస్సులో
భారతీయ భాషల కవులు వారి వారి భాష లలో కవిత్వాలన్నింటికీ సొగసును వివిధ వాదాల తీరుతెన్నులను వివరించారు.తమిళ , మళయాళ, హిందీ, ఉర్దూ, ప్రపంచ కవిత్వం బారతీయ ఆంగ్ల కవిత్వము మొ..వాటిల్లో  ప్రసంగించారు.

ఆ తరువాత గ్రంధావిష్కరణలు జరిగాయి.చేనుగట్టు పియానో డా.ప్రసాదమూర్తి ముసిబాస డా. జివి.రత్నాకర్ మొ..వారి గ్రంధాలు ఆవిష్కరించడం జరిగింది.

అదే రోజు బహుభాషా జాతీయ కవిసమ్మేళనం జరిగింది దాదాపు 30 మంది వివిద భాషల్లో కవిత్వాన్ని చదివి వినిపించారు. శ్రోతల మన్ననలందుకున్నారు.

27 నవంబరు ఆదివారం .. సమకాలీన తెలుగు కవిత్వంపై జాతీయ సదస్సు జరిగింది..
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు అధ్యక్షులు గా  డా.శ్రీమతి శ్యామలగడ్డం, అంతర్జాల కవిత్వం-మహిళలు అన్న అంశంపై ప్రసంగించారు.అంతర్జాల కవయిత్రులు స్పృశించని వస్తువు లేదన్నారు. ఉదాహరణలుగా కవితా పాదాలను చదివి వివరించారు . చివరి గా అన్నార్తుల ఆర్తనాదం అని రైతన్నల జీవితాలపై రాసిన తన కవితను వివరించారు.
ప్రముఖ కవి గాయకుడు శ్రీ రసరాజు తెలుగు పద్యం గేయం గురించి చెబుతూ రెండింటికి లయ అవసరమని చెప్పారు.
శ్రీ ఖాదిర్ మొహియుద్దీన్ ముస్లిమ్ మైనారిటీ వాదంపై పత్రసమర్పణ చేసారు. కవిత్వం లో ముస్లిమ్ మైనారిటీ వాదం ప్రారంభదశ , కొనసాగిన విధానము తెలియచేసారు.
శ్రీ దర్బశయనం శ్రీనివాసాచార్య తెలంగాణా కవిత్వం గురించి చెప్తూ తెలంగాణా ఉద్యమ కవిత్వం వెలువడిన  తీరు  తమ సమస్క్ృతిని చాటుకునే స్థితిలోని కవిత్వాన్ని చర్చించారు.శ్రీ కొప్పర్తి  ఆధునికకవిత్వం ..అభివ్యక్తి  అన్న అంశంపై  మాట్లాడారు. ఆధునికకవిత్వం లో వస్తువు ఎంత గొప్పదైనా అభివ్యక్తి లో ప్రత్యేకత ఉండాలి.అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
డా. ఆర్. సీతా రామ్ గారు ఆదునికకవిత్వము...విమర్శ అంశంపై పత్రసమర్పణ చేసారు.. ఆధునికకవిత్వం పై సరియైన విమర్శ కావడంలేదు ఆవేదన వ్యక్తం చేసారు.
తరువాత డా.యాకూబ్ తెలుగు కవిత్వం..సోషల్ మీడియా..అంశంపై  సోషల్ మీడియా లో కవిత్వ సమూహాలగురించీ , వారు అడ్మిన్ గా ఉన్న  కవిసంగమం గ్రూప్ గురించి వివరించారు..దీనిలో విమర్శ లు కూడా విలువకలిగినవిగా ఉంటున్నాయన్నారు. సోషల్ మీడియా ద్వారా మన కవిత్వాన్ని విశ్వవ్యాప్తం చెయ్యచ్చన్నారు

ఆ తరువాత  కవి శ్రీ శివారెడ్ఢి గారికి శిఖామణి సాహితీ పురస్కారం ప్రదానం జరిగింది. శివారెడ్ఢి గారిగురించి వారి కవిత్వాన్ని గురించి  డా.ప్రసాదమూర్తి గారు తెలియచేసి    అభినందనలు తెలిపారు .. శివారెడ్ఢి గారు పై డాక్యుమెంటరీ చిత్రాన్ని  ప్రదర్శించారు.

చివరగా జాతీయ కవిసమ్మేళనం జరిగింది. శ్రీ సుధామ,అతిథిగా, యాకూబ్ అధ్యక్షులు గా  జరిగిన కవిసమ్మేళనం లో దాదాపు 150 మంది కవులు పాల్గొన్నారు.

మొత్తం మీద యానాం కవితోత్సవ రధసారధులుగా  శ్రీ దాట్ల దేవదానంరాజు గారు, డా.శిఖామణి గారు, డా.వరుగు భాస్కర్ రెడ్డి గారు కవితోత్సవంలో పండుగ వాతావరణాన్నే  సృష్టించారని చెప్పాలి.సదస్సుల్లో కూడా కవిత్వంపై లోతైన చర్చ జరిగింది.

ప్రపంచమొక పద్మవ్యూహం
కవిత్వమొక తీరని దాహం
అని శ్రీ శ్రీ అన్నట్లు  కవిత్వదాహాన్ని తీర్చడానికి  మంచి ప్రయత్నమే జరిగింది.... యానాం కవితోత్సవంలో.....

నాకు గుర్తున్నంతవరకు  రాసాను. పొరపాట్లు జరిగితే క్షమించగలరు.

డా. శ్యామలగడ్డం.....