Saturday, 30 December 2017

గజల్..2016--అందమెంతో..

చిత్రకవితా మంజరి...తెలుగు గజల్...రచన.డా. శ్యామలగడ్డం.....28.12.2016...
+++++++++++++++++++++++++++++++

జాబిలమ్మతొ  ముద్దుమోమూ  పంతమాడిన  అందమెంతో

ఆకసమ్ము తొ  నీలివసనము  ఆటలాడిన   అందమెంతో

పిల్లతెమ్మర  వాతెరల్లో  ధవళకాంతుల. సందడెంతో

కలువకన్నుల   వీక్షణములతొ.  నిరీక్షించిన.  అందమెంతో

మయూరాన్నే   చెలిగ చేసీ.  రాసియుండిన   లేఖలెన్నో

ప్రియుని చేరా   రాయబారిగ   చేసియుండిన   అందమెంతో

వియోగాలా.  జలధిలోనా  తీరమెక్కడ. తెలియకున్నా

మరులు గొలిపే.  లేఖలెన్నో.  రాసియుండిన   అందమెంతో

శ్యామ తెలిపే   ఊసులన్నీ. కొంటెకృష్ణుని   చిలిపిచేష్టలు

తొందరించిన   మనసునెంతో    ఆపియుండిన  అందమెంతో..

.

డా. శ్యామలగడ్డం....28-12-2016....

+++++±++++++++++++++++++++++++++

గజల్....2015..నెచ్చెలీ

గజల్ కాన్వాస్-- 38--- నెచ్చెలీ...28-12-2015-----డా. శ్యామలగడ్డం

కలలలోన తేలియాడు సమయమేలె నెచ్చెలీ
రెప్పలేమొ బరువాయెను నిదురలేదె నెచ్చెలీ

మరుని రూపమగుపించెగ మదియె పులకరింతకాగ
మరునిముషము కానరాక కలవరమె నెచ్చెలీ

తానురాక తనవంతున లేఖలెన్నొ పంపినాడు
జాబిలియే జారవిడుచు వెన్నెలాయె నెచ్చెలీ

సుమశరుడే సంధించిన బాణమేను మదినితాక
విరహానల వేగుచుంటి..దయచూపడె నెచ్చెలీ

ప్రతిక్షణమొక యుగముగాను సాగుచుండె తాపముతొ
తుషారముగ తాకగాను తాను రాడె నెచ్చెలీ

డా. శ్యామలగడ్డం......

Friday, 29 December 2017

కవనతరంగిణి.........

మిథున కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో శనివారం
వచ్చేస్తుంది.. శనివారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........

ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...

రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...

మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను

సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం 2018 శుభాకాంక్షలతో.....కవనతరంగిణికి స్వాగతం....2018, కొత్త సంవత్సరంలో,
ఆశల వలువలు  చుట్టుకొని, ఆశయాల ఆమనిలో , సంకల్పమే సాధనంగా  లక్ష్యమనే తీరాలను చేరాలని  మనసారా కోరుకుంటూ.....ఈ వారం కవనతరంగిణికి మరొక్కసారి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం...

"కవిత్వమంటే పందిరి మీదకు ద్రాక్షతీగను పాటించడం, పద్మవ్యూహం లోంచి బయటపడే ప్రయత్నం చేయడం, పియానో మెట్లమీద సమ్మోహనరాగ జలపాతాలను దూకించడం."...అంటారు దేవీప్రియ...

సుప్రసిద్ధ కవి జర్నలిస్టు దేవీప్రియ రచించిన గాలి రంగు కవితాసంపుటికి 2017 సంవత్సరంలో  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం ముదావహమైన విషయం.నాలుగున్నర దశాబ్దాలుగా కవిత్వాన్ని వాహికగా చేసుకొని మంచి కవిత్వాన్ని వెలయి స్తున్నారు.....

దేవీప్రియ గారి అసలుపేరు షేక్ కాజా హుస్సేన్.గుంటూరు జిల్లా వాస్తవ్యులు..‌..దేవీ ప్రియ కలం పేరుతో   అరణ్యపురాణం,  అమ్మచెట్టు, నీటిపుట్ట, గరీబుగీతాలు, పిట్టకూడా ఎగిరిపోవాల్సిందే మొదలైన కవితా సంపుటులను వెలువరించారు.

కవిత్వాన్ని అతి సామాన్యంగా, అసామాన్యం గా చెప్పగలిగే కవి.

"నడిస్తే మదపుటేనుగు లా నడవాలి/ నవ్వితే మొనాలిసాలా నవ్వాలి/రాస్తే కాళిదాసు లా రాయాలి/ గీస్తే పికాసో లా గీయాలి/ పుడితే మా అమ్మకడుపున పుట్టాలి/ కవిగా అచ్చంగా నాలాగానే పుట్టాలి"/ అంటారు దేవీ ప్రియ......

ఇలాంటి గొప్ప కవులను ఆదర్శంగా తీసుకుని కవిత్వరచన చెయ్యవలసింది గా కోరుతున్నాను...

ఈ వారం నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ....

కవితలుగానీ, పద్యాలు కానీ...పైన తెలిపిన ఏ ప్రక్రియలో నైనా మీ రచనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించవచ్చును..

లేదంటే మీకు ఇష్టమైన ఏ వస్తువునైనా గ్రహించి రచనలు చేయవలసిందిగా మనవి...

కవనతరంగిణిని నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన అడ్మిన్ లీల గారికి ధన్యవాదాలతో, సభ్యులందరికీ శుభాకాంక్షలతో....

అడ్మిన్,

డా.శ్యామల గడ్డం.

(29-12-2017)30-12-2017...

Wednesday, 13 December 2017

పాల్కురికి సోమన...

మతపరిస్థితులు: సాహిత్యం సామాజిక జీవన ప్రతిబింబ మని విజ్ఞుల భావం సామాజిక పరిస్థితుల్ని బట్టి సాహిత్య దృక్పథం కూడా పరిణామం చెందుతూ ఉంటుంది. ప్రాచీన సాహిత్యం ఎక్కువ భాగం మత దృక్పథంతోనే వెలువడింది. సమాజంలో జైన బౌద్ధాల ప్రభావం మితిమీరిపోయినపుడు వైదిక మత పునరుద్ధరణ కోసం పంచమ వేదంగా నన్నయ మహాభారతాన్ని రచించాడు. కాకతీయులు మొదట జైనులుగానే ఉండి తర్వాత బసవడు స్థాపించిన వీర శైవ మతాన్ని అనుసరించారు. పాల్కురికి వేద ప్రమాణాల్ని నిరసిస్తూ, వీరశైవం వేద విహితమైనదని తన రచనల్లో చెప్పాడు.
వీర శైవ మతము: వీరశైవులు, తక్కిన శైవ సంప్రదాయాల కన్న వైదిక మతాన్ని ఎక్కువగా నిరసించారు. వీర శైవం సంఘ సంస్కరణకు నాంది పలికింది. కుల విధానాన్ని వ్యతిరేకించింది. శూద్రులకు పంచములకు కూడా కావ్య గౌరవం కలిగించింది. స్త్రీ, పురుషుల సమానత్వాన్ని చాటి చెప్పింది. వీర శైవ కవుల్లో అగ్రగణ్యుడు పాల్కురికి. శివుణ్ణి పరమదైవంగా భావించే మతం శైవం. శైవులు 'ఏక ఏవరుద్రో' అని శివుడొక్కడే దేవుడని చాటుతారు. శివుడు సగుణ నిర్గుణ పరబ్రహ్మ. కాశీ యందు విశ్వేశ్వరుడు శ్రీశైలమందు మల్లికార్జునుడు, హిమాచలమందు గౌరీశంకరుడు. ఈ శైవాలయాలు శైవ వ్యాప్తిని తెలియజేస్తున్నాయి. శివునికి ఇతరులు సరిరారని సోమన ''శంకర దాసయ్య'' కథలో పేర్కొన్నాడు.
బసవేశ్వరుడు కర్ణాటక దేశంలో వీరశైవమును స్థాపిస్తే ఇతని చరిత్రను మొదట తెలుగులో బసవపురాణంగా పాల్కురికి సోమనాథుడు రచించగా తరువాత ఇది కన్నడములోనికి భాషాంతరీకరణ పొందింది. అదేవిధంగా పండితారాధ్య చరిత్ర కూడా కన్నడ భాషలోనికి తెలుగు నుండే ప్రయాణము చేసింది. శివకవుల మతావేశమునకు ఉదాహ రణగా బసవ పురాణములో ఒక సంఘటనను ఉదహరిం చవచ్చును. శివభక్తుడైన భృంగి ఒకమారు శివుని దర్శింప బోయెను. ఆ సమయంలో శివుడు పార్వతీ సమేతుడై ఉండగా శివునికి మాత్రమే నమస్కరించి భృంగి వెనుదిరిగి పోయెనట. శివునికే తప్ప ఇతరుల ముందు శిరస్సు వంచని మతావేశము వీరిది. పైవిధంగా సోమనాథుని రచనలు వీరశైవ మత స్వరూపం మత విద్వేషాలు, మత సంప్ర దాయాలు ప్రతిఫలిస్తూ ఆనాటి మత పరిస్థితుల్ని అవగాహన చేసుకొనుటకు దోహదమౌతున్నాయి. జాతి బేధాలకు ఏ మాత్రం తావివ్వని వీరశైవమతాన్ని పాల్కురికి సోమన అనుసరించాడు.

Friday, 24 November 2017

మిథున‌............

మిథున కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో శనివారం
వచ్చేస్తుంది.. శనివారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........

ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...

రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...

మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను

ఈ రోజు స్త్రీ వాద సాహిత్యం గురించి, స్త్రీ వాద కవయిత్రులు రాసిన కొన్ని కవితలగురించి తెలుసుకుందాం...

ఆధునిక స్త్రీ వాద సాహిత్యం తెలుసుకోవడమంటే సముద్రపు లోతులను  వెతకడమే అని నా అభిప్రాయం..

ప్రాచీన కాలంలో తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల ,రంగాజమ్మ వంటి కవయిత్రులున్నప్పటికీ, వారు భక్తితోనో, రాజుల కొరకో కవిత్వం రాసారు...

ఆధునికయుగంలో ముఖ్యంగా 1980 లో తరువాత  తెలుగు కవిత్వంలో స్ర్తీ వాద ధోరణులు ,వాటి ప్రభావంతో సమాజాన్ని ప్రభావితం చేసే కవిత్వం వచ్చింది....

ఆకాశంలో సగం అన్నట్లున్న స్త్రీలు వారి మానసిక వేదనలను కవిత్వీకరించడం మొదలయ్యింది.....1975-85
అంతర్జాతీయ మహిళా దశాబ్దం సందర్భంగా ప్రపంచమంతటా స్త్రీలు సమావేశాలు జరుపుకోవడం...తీర్మానాలు చేసుకోవడం...ఆ ప్రభావం తెలుగు సమాజంపై కూడా ప్రభావాన్ని చూపింది..

    ఆ సమయంలో  ఓల్గా, జయప్రభ, విమల, సావిత్రి...మొదలైన కవయిత్రులు స్త్రీ ల జీవితం సాఫీగా సాగకపోవడానికి కారణం పురుషాధిక్య సమాజమనీ, వారిని అన్ని విధాలుగా తక్కువగా చూడడం.మహిళలవేదనకు కారణమనీ...ఇదంతా రాజకీయమని...అది మహిళలు తెలుసుకోవలసిన అవసరముందనీ, వారు భావించి , ఆకోణంలో
...కవిత్వం రాసారు...

లో సావిత్రి ” బంది పోట్లు ” అనే కవిత రాసింది!

” పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళిచేస్తానని
పంతులు గారన్నప్పుడే భయమేసింది !
ఆఫీసులో నా మొగుడున్నాడు
అవసరమొచ్చినా సెలవివ్వడని
అన్నయ్య అన్నప్పుడే అనుమాన మేసింది!

వాడికేం ? మగమహారాజని
ఆడా, మగా వాగినప్పుడే అర్థమై పోయింది
పెళ్ళంటే పెద్ద శిక్ష అని
మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని

మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తోందని! ”

సావిత్రి రాసిన ఈ పద్యం కన్నా ముందొచ్చిన రేవతీ దేవి కవిత్వంలో ఈ రకమైన గొంతు లేదు. ఒక అశాంతీ, దిగులు… అంతర్మథనం… చెప్పుకోలేని అసహనం… ఇవీ కన్పిస్తాయి ” శిలాలోలిత ” పుస్తకంలో! రేవతీదేవి ఇలారాస్తుంది….

” దిగులు
దిగులు దిగులుగా దిగులు
ఎందుకా
ఎందుకో చెప్పే వీలుంటే
దిగులెందుకు ” అని

సావిత్రి ” బందిపోట్లు ” లో ఈ గుంజాటన పడటం మరిలేదు. ఎందుకో చెప్పే వీలుంటే అన్న ఊగిసలాట లేదు. అదెందుకో చెప్పెయ్యటమే తప్ప!!

ఆశ్చర్యం ఏమిటంటే చేకూరి రామారావు గారు ప్రస్తావించేదాకా సావిత్రి రాసిన ” బంది పోట్లు ” విశేషంగా ఎవరి దృష్టినీ పడలేదు. ఇలా ఎంత మంది రాసినవి మరుగున పడిపోయినా వింత కూడా లేదు. సావిత్రి ” బందిపోట్లు ” అలాకాకుండా సాహిత్యానికి మిగలటం అదృ
ష్టంగా భావించాలి...

, వేల్చేరు నారాయణరావు ఆంధ్రజ్యోతి వారపత్రికలో వామనుడి మూడోపాదం పుస్తకాన్ని రివ్యూ చేస్తూ పై మూడు కవితలనీ తీసుకుని విశ్లేషించిన పద్ధతి వల్లనే ఈ కవితలు ఎక్కువ చర్చకి కారణం అయ్యాయి అన్నది! బహుశా నారాయణరావు గారు వామనుడి మూడోపాదాన్ని పునస్సమీక్షిస్తే తప్ప ఈ దోషం పోదనుకుంటాను. ఆ పుస్తకంలో ఇంకా ముఖ్యమైన కవితలున్నా రివ్యూదారులని ప్రధానంగా ఆకర్షించిన కవితలు పైన నేను చెప్పినవే! ఇందులో ” చూపులు ” అన్న కవిత  ఆడదాన్ని గాయపరచగల మగవాడి చూపులెలా ఉంటాయో… అవి ఆడవాళ్ళని ఎంతగా హింస పెడతాయో చెబుతుంది. ఈ కవితకి ఆడవాళ్ళు వయసులో చాలా పెద్ద వాళ్ళయిన ఆడవాళ్ళతో సహా, చాలా లీనమై స్పందించారు. ఇది ఇతర భాషలలోకి అనువాదమైంది..

” రెండు కళ్ళనించి చూపులు సూదుల్లా వచ్చి
మాంసపు ముద్దలపై విచ్చల విడిగా తిరుగుతుంటాయి
చూపులెప్పుడూ ముఖంలోకి చూడవు
మాట ఎప్పుడూ మనసు నించి పుట్టదు
కనిపించి నప్పుడల్లా కంపరం పుట్టేలా
వంటిమీద చూపులు చెదల్లా పాకుతూ ఉంటాయి

ఆ కళ్ళల్లో లక్ష వర్గాలున్నాయి
కానీ చూపులకి మాత్రం వర్గ విభేదాలు లేవు
ఆ చూపుల్లో ఎప్పుడూ ఒక్కటే సంకేతం ఉంటుంది
చొంగ కార్చే కుక్కలాంటి ఆకలుంటుంది
వికృతమయిన భల్లూకపు పట్టులాంటిదేదో విడవక
కలల్లో సైతం వెంటాడుతుంది

చిక్కని ఈ అడివిలో వెలుగుకీ చీకటికీ తేడానే ఉండదు.
చూపుల నించి దాటుకోవడానికి స్థలమనేదే ఉండదు.
రోడ్డుమీద… బస్సులోనూ…. క్లాసులోనూ
వేసే ప్రతి అడుగు వెనకా

శరీరంలోని ఏదో ఒక భాగాన్ని గాయం చేస్తూ
విషపు చూపులు గుచ్చుకుంటూనే ఉంటాయి
ఒక్కోసారి భయమేసి
సుదూర ఆకాశంలోకి శూన్యంలోకి
మాయమయి పోవాలనిపిస్తుంది
కానీ,
పలాయనం పరిష్కారం కాదని
విషపు చూపుల నెదుర్కొనే ముళ్ళలాంటి తీక్షణతని
కళ్ళకి నేర్పటం మొదలెట్టాను
ఇప్పుడు ఆ కళ్ళని వెంటాడటానికి
కళ్ళతోనే యుద్ధం చేస్తాను
సూటిగా రెండు క్షణాలు కళ్ళలోకి చూడలేని
పిరికి చూపులు
పాతాళం లోకి పారిపోతాయి

అప్పుడనుకుంటాను
కళ్ళకే కాదు
ఈ దేశంలోని ఆడదానికి
వళ్ళంతా ముళ్ళుండే రోజు
ఎప్పుడొస్తుందా అని!

   నీలిమేఘాలు  కవితా సంకలనం స్త్రీవాద కవితా సంకలనం..1995 ప్రాంతాల్లో సాహిత్యంలో సంచలనాన్ని కలిగించింది.....ఇందులోని అన్ని కవితలూ స్త్రీ శారీరక బాధలు మానసిక వేదనలు, సమాజంలోని స్త్రీ పురుష అసమానతలను చాటి చెప్పేవే..
మరి కొన్ని కవితలను వచ్చేవారం పరిశీలిద్దాం...

..................సశేషం...

ఈవారం కవనతరంగిణిని మీ అద్భుతమైన కవితలతో అలంకరిస్తారని ఆశిస్తున్నాను....

నాకు కవనతరంగిణి నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన అడ్మిన్ శ్రీమతి లీల గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను...శీర్షికను ఉత్సాహవంతంగా  తమ కవితలతో రసభరితం చేస్తున్న సభ్యులందరికీ శుభాకాంక్షలతో......

మీ,

అడ్మిన్,

డా.శ్యామల గడ్డం...

Friday, 10 November 2017

శివారెడ్డి..

 మిథున కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో శనివారం
వచ్చేస్తుంది.. శనివారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........

ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...

రుబాయీలు,
గజళ్ళు,.
నానీలు..
నానోలు.
హైకూలు.
రెక్కలు
ఏకపాదకవితలు,
ద్విపాదకవితలు,...
త్రి పాద కవితలు...
వచన కవితలు..
చిత్ర కవితలు
పద్యాలు...

మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను...

ఈ రోజు కవిత్వానికి మూడో కన్ను తెరిపించిన శివుడు ( శివారెడ్డి) కవిని గురించి తెలుసుకుందాం..

ఈరోజు శివారెడ్డి కవిని గురించి చెప్పడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. తెలుగు వచన సాహిత్యంలో  నేడు ఎంతోమంది కవులకు మార్గదర్శకులు, కవిత్వంలో తప్పటడుగులు వేస్తున్న వారిని సైతం అక్కున చేర్చుకుని కవిత్వపు మెళకువలు నేర్పి,ప్రోత్సహించే కవి, కొత్తగా కవితా సంకలనాలు, సంపుటులు వేస్తున్న కవులు పుస్తకాలకు సైతం ముందుమాట రాసి,  వెన్నుతట్టే కవితాప్రియులు....నిరాడంబర జీవి....

..అలాంటి కవి ఈ రోజు కబీర్ సమ్మాన్ అవార్డు తీసుకుంటున్న మహత్తరమైన రోజు..

తెలుగు కవి, సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య కె. శివారెడ్డి సాహిత్య కృషికిగానూ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం ‘‘కబీర్‌ సమ్మాన్‌’’ వరించింది. ఈ నెల 10న భోపాల్‌లో జరిగే సాహిత్య సభలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డును అందుకుంటున్న తొలి తెలుగు కవి శివారెడ్డి కావడం విశేషం. మొదటిసారి తెలుగుల కవిని ఈ అవార్డు వరించడంతో తెలుగు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ‘ఆరు దశాబ్దాలుగా కవిత్వమే జీవితంగా బతుకుతున్న కె. శివారెడ్డి గారిని ఈ అవార్డు వరించడం
తెలుగువారందరికీ గర్వకారణం...

ముఖ్యంగా ఏ అవార్డులకోసమూ కవిత్వం రాయని కవి ఏ సన్మానాలు కోసమో ఆరాటపడని నిష్కల్మష, నిస్వార్ధ
కవి. ప్రజలతో నిరంతరం మమేకమవుతూ,ప్రజలు, మనిషి,మట్టి, శ్రమ ...ఇలాంటివి మాత్రమే వస్తువులుగా స్వీకరించి కవితా సంపుటులు వెలువరించిన కవి....

Tuesday, 24 October 2017

కుందుర్తి.........

   


       పాతకాలం పద్యమైతే/వర్తమానం వచన గేయం....అని ఎలుగెత్తి చాటిన వచన కవితోద్యమకారుడు..కుందుర్తి ఆంజనేయులు గారు...పద్యానిదే పై చేయిగా ఉన్నరోజుల్లో  ఛందస్సు పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు కుందుర్తి....ఫ్రీ వార్స్ ఫ్రంట్ సంస్థను స్థాపించి వచన కవితా వ్యాప్తికి నిరంతరం కృషి చేసి వచన కవితా పితామహుడు అని బిరుదు పొందిన మహనీయుడు..

మహా భారతం తరహాలో తెలంగాణా పోరాట కథను 18 పర్వాలు గా విభజించి తొలిసారిగా వచన కవిత్వంలో మహా కావ్యాన్ని రాసిన ఘనత కుందుర్తి కే దక్కుతుంది......వీరు రాసిన నగరంలో వాన  కవితా అందరికీ గుర్తుండే ఉంటుంది....ఈ రోజు వరకు వానిపై అంత మంచి కవిత రాలేదు అంటే అతిశయోక్తికాదు...

      ముఖ్యంగా ఈ రోజు వచన కవిత్వం విస్తరిల్లిన తీరు చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది...వచన కవిత్వం వచ్చింతర్వాత కవిత్వం రాయడం తేలికయ్యింది...దానివలన మినీ కవితనానోలు,నానీలు.త్రిపాదకవితలు, ద్విపాద కవితలు, ఏకపాద కవితలు, రెక్కలు  హైకూలు మొదలైన వివిధ రకాలైన ప్రక్రియలకు మూలం వచన కవిత్వం...వచన కవిత్వం వల్లనే కవిత్వం ఈ నాడు ప్రజలవద్దకు చేరింది...చేరుతుంది...

  అందుకే ఈరోజు కుందుర్తి ఆంజనేయులు గురించి కొంతైనా తెలియచేయాలనే ఉద్దేశ్యం తో  వారి గురించిన విశేషాలు, వివరాలు తెలియచేస్తున్నాను......కవనతరంగిణిలో........






సాహిత్యంలో ప్రాచీనం , ఆధునికాలకు ఎంత వైవిధ్యం ఉందో, గ్రాంధికం , వ్యవహారిక భాషలకి ఎంత వైరుధ్యం కలదో , పద్యానికి , వచనానికి అంతే వ్యత్యాసం ఉంది . ప్రాచీనులకి పద్యం , ఆధునికులకి వచనం ఆలవాలమైంది . సాహిత్యాన్ని పామరులకు సైతం దగ్గరగా తీసుకు వెళ్లిన ఘనత వచనానికే దక్కుతుంది . అందుకే ఆధునిక సాహిత్యం వచనంతోనే ప్రకాశిస్తుంది అంటూ

“ పాత కాలం పద్యమైతే / వర్తమానం వచన కవిత్వం “ వచనానికి అధిక ప్రాముఖ్యం ఇచ్చిన కవి , వచన కవితా పితామహుడిగా పేరుగాంచిన వ్యక్తి కుందుర్తి .
కుందుర్తి గా ప్రసిద్ధి చెందిన . ఈయన పేరు ఆంజనేయులు . కుందుర్తి ఇంటి పేరు . 19 22 డిసెంబర్ 16 న కామయ్య , నరసమ్మ దంపతులకు నర్సారావు పేట సమీపంలోని కోట వారి పాలెంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు . నిఘంటువులు అవసరంలేని భాషలో కవిత్వం రావాలని ఆశించాడు . 19 7 6 లో ప్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించి వచన కవితోద్యమానికి మూల స్తంభంగా నిలిచాడు . సోవియట్ ల్యాండ్ నెహ్రు అవార్డు , ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు అందుకున్నారు . నయాగరా , తెలంగాణ , నగరంలోని వన , యుగే ..యుగే , నాలోని నాదాలు , మాతృ గీతం , ఇదేనా దేశం మొదలైనవి వీరి రచనలు . కుందుర్తి , బెల్లంకొండ రామదాసు , ఏల్చూరి సుబ్రహ్మణ్యం వీరిని నయాగరా కవులు అంటారు . కుందుర్తి రచనల్ని కుందుర్తి కృతులు పేరుతో ప్రచురించబడ్డాయి .
తెలంగాణ కవితా సంపుటిలో మొత్తం 26 కవితలున్నాయి . మొదటి కవిత ప్రస్తావన లో భారత దేశం యొక్క చరిత్రని , వర్తమానాన్ని ఈ కవితలో వివరించాడు . భారత దేశంలోని రాజులు గురించి , రాచరికాలు గురించి తెలుపుతూ
“పూర్వం ఒకనాడు
ఒక రాజు యింకోరాజును
దండెత్తి ఓడించాడు
ఓడినరాజు వారసులు విజేత రాజును బలిగొని
అతని రాజ్యం ఆక్రమించాడు .” అంటూ పూర్వం భారత దేశం లో రాజుల గురించి , ఒకరు మీద ఒకరు ఏవిధంగా ఆధిపత్యం చెలాయించాలి అని ఆరాట పడేవారో చివరకి అందరు కలిసి పాలన అధికారాన్ని విదేశీయుల పరం చేసారో చెప్పాడు .
రాను రాను కొన్నాళ్లకు
వారు రాజులయ్యారు
ప్రజలు బానిసలయ్యారు “ అనడంలో విదేశీయులు మనపై అధికారాన్ని ఎలా చేజిక్కించుకున్నారో తెలుస్తుంది . అలాగే సింహాసన కవితలో హైదరాబాద్ సంస్థానం గురించి , అక్కడి ప్రజల అవస్థలను చెబుతూ …” దేశంలోని సంస్తానాలన్నింటిలో / హైదరాబాదు పెద్దది / భూస్వామికుల బాధల్ని ప్రజలు సహించిన / చిట్టచివరి హద్ద అది “ తెలంగాణాలోని హైదరాబాద్ స్థానంతెలుస్తుంది . ప్రజలు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని “ప్రజోద్యమ” కవితలో …
“ఏ రోజు కారోజు రాజు గారి కొలువులో
వెట్టి చేసే వాడు
ఏ పూట కాపూట కడుపును
నిందించుకునే వాడు
చరిత్ర రధ చక్ర గమనాన్ని
శాసించ బూనుకున్నాడు “ బానిసత్వం , పేదరికం ఏ స్థాయిలో ఉన్నాయో అవగతమవుతాయి .
కుందుర్తి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే కవిత “ నగరంలోని వాన “. ఈ కవిత నగరంలోని వాన కవితా సంపుటిలోని మొదటి కవిత . నగరంలో కురిసే వాన మనుషులతో ఆడే దాగుడుమూతలు , నగర వాసులకు కలిగించే ఇబ్బందులు , అలాగే వాళ్ల మీద అప్పుడప్పుడు చూపించే కనికరం అన్నింటిని హృద్యంగా వర్ణించాడు కుందుర్తి . ఈ కవితలో రచయిత తనకు తెలిసిన నగరంలోని వాన అంటే హైదరాబాదు నగరంలోని వాన అని ముగిస్తాడు . కాని ఈ వాన ప్రతి నగరం లో కురిసే వానకి ప్రతీకగా ఉంటుంది .
“ నగరంలో వాన
కవిత్వం నా ఊహాంచలాల్లో కదిలాడుతున్నట్లు
జల్లులు జల్లులై కురుస్తుంది “ అంటూ మొదలవుతుంది . నగరంలోని భవానాలు , రోడ్లపై , పడే వర్ష వలన అవి ఎలా కన్పిస్తున్నాయో ఈ విధంగా వర్ణిస్తాడు రచయిత . “నున్నగా తెల్లగా తళతళలాడే/ సిమెంటు రోడ్డు అద్దాలోకి /మింటి నుంచి మెడలు వంచి” మిల మిలా మెరుస్తున్నాయి మేఘాలు అంటాడు కవి . నగరంలో కనిపించే రెండతస్తుల బస్సులను చూసి గిరిశిఖరాలు అనుకుని మేఘాలనుకుని భ్రాంతి పడ్డాయని చమత్కరిస్తాడు .
నగరంలోని బ్రతికే మధ్య తరగతి వాడికి వర్షం వస్తే పడే అవస్థను వివరిస్తూ , వాడి ఆర్ధిక పరిస్థితిని మించి కొనలేనిస్థితిలో తడిసి ఇంటికి వచ్చి కుంపటి ముందు కూర్చుని ఉన్న ఉద్యోగి చూస్తూ తను చేసిన ఘన కార్యం కనులార చూసుకోవాలని /కిటికీ లోంచి తొగి చూస్తుంది చిటపట చిలిపి జల్లుల్తో . నగరంలో కురిసే వాన గడుసరిదే దానికి కాస్తో కూస్తో జాలి , దయ ఉన్నాయని మూడునాళ్ల పసిపాపను /ముద్దుగా ఒడిలో గుండెలకు కద్దుకుంటూ / ఆసుపత్రినుంచి ఇంటికి వచ్చే బాలెంతరాల మీద పూలజల్లు కోరుస్తుందే కాని జోరున వర్షం పడదు , అంటూ వర్ష జాలిని తెలియజేస్తాడు .
యుగే …యుగే కవితా సంపుటిలో నేను కవితలో తన కవిత్వం ఎవరికి చేరాలో తెలుపుతూ “ ఇది నా కవిత్వం గీత , వినేవాడు నరుడు /చదువు సంధ్యలు రాణి రోడ్డు మీద పామరుడు “ . రేడియో ఏడ్చింది . మహాత్ముని అస్తమయం గురించి రేడియోలో విన్న వార్త . మహాత్ముడిక లేడు . అనే కవితలో “ గౌరీ శంకర శిఖరం యేరుగా పారింది /గంగానది శోక బాష్పములు కాల్వలు కట్టింది /వెన్నెల హృదిలో /తమస్సు తెర విరిసింది /నీవు వాటికి సహోదరుడువు /వాటి కీర్తికి సహోదరుడవు “ ఆ మహాత్ముని కీర్తిని తెలియజేసాడు . తని గువువైన కవి సామ్రాట్ విశ్వనాధ షష్టి పూర్తికి రాసిన ఈ కవిత “ పూంభావ సరస్వతి , పూజ్య పాదులు /గురువుగారికి నమస్కారం / షష్టి పూర్తి సన్మాన సంఘం , నిర్వాహకులకు అభినందనలు / అప్పుడే అరవై నిండాయి / కాలానికి ఎందుకోయింత వేగం ? / ఆగమంటే ఆగదు /ఆయన ప్రభావంతో /మీలాగే రాసి ,అలాగే చదివి /ఉపన్యాసాలు చేద్దామని ఉవ్విళ్ళూరే రోజుల్లో /అనుకరణ లని ఎవరేనా చెప్పినా సరే /అవమానం లేని రోజుల్లో ……..ఐ ఇంకా వెలుగులోకి రాలేదు /దాని పేరు “సౌప్తికం “, పాపం ! ఇంకా నిద్రిస్తూనే ఉంది . “ తన గురువు ప్రభావాన్ని వివరిస్తాడు .
బుద్ద జయంతి కవితలో “ అంతగా బుద్దుడిని పూజించడం మానేసి /అనుసరిద్దాం ఆయన బోధనలు /అహింస తో , సత్యంతో /పరిష్కరిద్దాం మన బాధలు “మనం స్వాతంత్ర్యం కోసం చేసిన పోరును చూసిన ఇతర దేశాల వారు దానిని అనుసరిస్తుంటే , వలస రాజ్యాల ప్రభువుల బ్రతుకుల్లో చీకటి ప్రారంభమైందని తెలియజేస్తూ పంచశీల గురించి , అహింసను గురించి దేశ విదేశాలపై వాటి ప్రభావాన్ని వివరించాడు .
మాతృ గీతం కవితా సంపుటిలో మాతృ గీతం లో తల్లిని తలుచుకుని రోదించే సందర్భంలో….
“ అమ్మ! నిన్ను చూడాలని ఉంది /నువ్వింక మా ఇంటికి లేవన్న ఊహ /నాలో ఒక వింతైన నవ్వుగా పరిణమిస్తున్నది “ విలపిస్తాడు . అమ్మ దూరమయ్యిన క్షణంలో తన స్థితిని చెబుతూ “ అమ్మ క్షణంలో నన్ను /ప్రాణం ఉన్న మట్టి బొమ్మగా చేశావు /ఓదార్పుల గాలి లేంది కదల్లేని /చెట్లు కొమ్మగా చేశావు అంటూ తన బాధను వ్యక్తపరుస్తాడు .
ఇదీ నా దేశం కవితలో ఇది నా దేశం / అని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుగా ఉంది “ అంటూ మొదలైన ఈ కవితలో ప్రతి పాదం తరవాత ఈ పదాలు కన్పిస్తాయి . సమాజంలోని ధర్మం గురించి , జరిగిన దోపిడీ వ్యవస్థను , దానిని క్రమబద్దంగా చేయలేని నిస్సహాయతని ప్రశ్నించుకుంటూ , సామాన్యుడి పరిస్థితిని చెబుతూ “ దేశ స్థితిని వివరిస్తూ / తినేది తక్కువా తీసి పారేసేది ఎక్కువ /సీతాఫలం పండులా ఉంది నా దేశం “అని దేశలోని పరిస్థితిని వివరిస్తాడు .
ఈ విధంగా కుందుర్తి కవితలన్నింటిలోనూ మానవీయత , దేశభక్తి , ప్రకృతి , సామాజిక సమస్యలు , సంఘటనలు , మహనీయుల గురించి వచన రూపంలో ఆవిష్కరించారు . సామాన్య చదువరునికి కూడా చేరేలా చేయవచ్చని నిరూపించారు .....

ఈ రోజు 25-10-2017..నా వారి వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం సబబు  అనిపించింది...

మిథున కవితా వనం సభ్యులకు నమస్సుమాంజలులు...ఇంకొన్ని గంటల్లో గురువారం వచ్చేస్తుంది.. గురువారం కవనతరంగిణికి స్వాగతం సుస్వాగతం........


ఆధునిక కవితా ప్రక్రియలకు పెద్దపీట వేసే కవనతరంగిణి మీ ముందుకు వచ్చింది......దీనిలో...


రుబాయీలు,

గజళ్ళు,.

నానీలు..

నానోలు.

హైకూలు.

రెక్కలు

ఏకపాదకవితలు,

ద్విపాదకవితలు,...

త్రి పాద కవితలు...

వచన కవితలు..

చిత్ర కవితలు

పద్యాలు...


మరి యే ఇతర ప్రక్రియ అయినా.....కవనతరంగిణికి రాసి పోస్టు చేయవలసిందిగా కోరుతున్నాను..


    ఈ శీర్షిక నిర్వహణకు అనుమతినిచ్చిన ఫౌండర్ అడ్మిన్ శ్రీమతి లీలా.కే గారికి ధన్యవాదాలు...ప్రతీ వారం ఈ శీర్షికను ఆదరిస్తూ దీనిలో వారి పోస్టులు పెడుతున్నట్లు కు సభ్యులను అభినందిస్తూ..

ఈవారం కూడా వారిఅధ్భుతమైన రచనలను అందించి మిథున కవితా వనాన్ని సుందరి సుమధురంగా తీర్చిదిద్దుతామని ఆశిస్తున్నాను....ధన్యవాదాలతో....


  మీ 

 అడ్మిన్.

 శ్యామల గడ్డం..

25-10-2017----( 26-10-2017)



Saturday, 21 October 2017

అమ్మగజల్ oct 2017.

అమ్మంటే  అనురాగం ....విరజాజుల పరిమళమే
అమ్మంటే అనుబంధం.....లేతీగల సున్నితమే.....

అమ్మంటే నిస్వార్ధం ....వెలుగు నిచ్చు కొవ్వొత్తిలె....
అమ్మంటే ఆప్యాయత ....సువాసనల సుగంధమే..
.
అమ్మ చూపు వెలలేనీ....శరత్కాల వెన్నెలలే
అమ్మంటే     ఆర్ద్రములే....కన్నీటీ   తుషారమే

అమ్మంటే అవనికదా....అంతులేని క్షమాగుణం
అమ్మ పిలుపు అలరించే వసంతాల  కోమలమే

అమ్మ మాట విన్నంతనె లేడిలాగ గెంతు మనసు..
శ్యామ చెంత   నిలుచునుగా  కైమోడ్పుల దైవతమే....

డా.శ్యామలగడ్డం...

21-10-2017

Thursday, 12 October 2017

సీసపద్యం.....

చెప్పంగ వశమౌన చెడువాన సిత్రాలు
      బతకలేక జనులు వెతలు చెంద

ఊరు వాడ లనక ఊపిరి తీయగా
     కురిసికురిసి వాన కుమ్మరించె...

బడుగు బ్రతుకులెల్ల  బావురనియె చూడ.
     పనియు పాటయులేక పాట్లు పడగ.

వరదగండమెపుడొ  వాసము కోల్పోగ.
      చేతికొచ్చిన పంట  చేర రాక.

దిగులు చెంది పేద  దీనుడై  భీరుడై
భవిత కవిత యయ్యె  భారమాయె
ప్రభుత  సాయ మడగ  పంచను చేరగా.
కురిసె జోరు  వాన  కుంభ వృష్టి....

Tuesday, 10 October 2017

పద్యం....10-10-2017

పద్య తరంగిణి... మిథున కవితా వనం..

చెప్పంగ వశమౌన చెడువాన సిత్రాలు
      బతకలేక జనులు వెతలు చెంద

ఊరనకయు,వాడనక ఊర్కొనక యు వాన
     కురిసికురిసి ఆగి  కమ్ముకొనియె..

బడుగు బ్రతుకులెల్ల  బావురనియె చూడ.
     పనియు పాటయులేక పాట్లు పడగ.

వరదగండమెపుడొ  వాసము కోల్పోగ.
      చేతికొచ్చిన పంట  చేర రాక.

దిగులు చెంది పేద  దీనుడై  భీరుడై
భవిత కవిత యయ్యె  భారమాయె
ప్రభుత  సాయ మడగ  పంచను చేరగా.
కురిసె జోరు  వాన  కుంభ వృష్టి....

డాక్టర్.శ్యామల గడ్డం....10-10-2017...

Wednesday, 4 October 2017

కవనతరంగిణి..


మిథున కవితా వనం సభ్యులకు 

ఏభైమూడేళ్ళపాటు ఎత్తిన కలం దించకుండా కవిగా విమర్శకునిగా ఉపన్యాసకుని గా నూతన తరాల సాహిత్యకారులను ఉత్సాహపరచిన నిరంతర సాహిత్య సంచారి అద్దేపల్లి రామమోహనరావు, తన 80వ ఏట కన్నుమూసేదాకా, తన ‘ప్రాణాన్ని’ సాహిత్య సామాజిక ప్రగతికి దోహదం కావటమే ‘ ముట్టని అరుదైన సాహిత్యకారులలో ఒకడు అద్దేపల్లి. ‘మధుజ్వాల’తో పద్యాన్ని కూడా వదిలి భావ వ్యక్తీకరణ సౌలభ్యమైన వచన కవిత ప్రక్రియలోకి ప్రవేశించాడు. అయితే ‘ఒకప్పుడు, కవిత్వాన్ని మాత్రమే ప్రేమించినపుడు, గోదావరి నన్నయ పద్యాల్లా శ్రీనాధుడి సీసాల్లా కనపడింది. ఇపుడు జీవితాన్ని కూడా అర్ధంచేసుకున్నప్పుడు, దోవ పొడుగునా పోరాటాల్ని మోసుకుపోతున్న పరమాణు ప్రవాహం కనిపిస్తోంది’ అని చెప్పుకున్న అద్దేపల్లి ‘సాంఘిక పురోగమనానికి ఉపయోగపడే ఏ కవితారేఖ కనిపించినా దాన్ని హృదయానికి హత్తుకునే వాడు సామ్యవాది’ అని భావించి ఆచరించినవాడు.

 

కొప్పర్తి అన్నట్టు ‘‘అద్దేపల్లి ప్రధానంగా స్థూల స్థాయి కవి (Macro Level Poet)’. అందుకు మినహాయింపులు లేకపోలేదు. ‘పాలకవర్గాల రధం ఆగితే నెడతారు, సాగితే తిడతారు’ అని ప్రగతిశీల శిబిరంలోపల గల వొక విమర్శకు సాక్ష్యంగా ‘ఇందిరమ్మకు భజనచేసే’ వారిపై 1972లో అద్దేపల్లి రాసినపాట ఆనాడు అనేకానేక వేదికలపై గానంగా వినిపించేది. కాంగ్రెసువారి నడుమ ఆధిపత్యపోరులో ఇందిరాగాంధీ దేశీయ విధానాలనే కాదు, పొరుగు దేశాల (సిక్కింను కలిపేసుకోవటం, బంగ్లాదేశ్‌ను ఏర్పరచటం)లో జోక్యాన్ని కూడా సమర్ధించి, ఆమెకు జవ, జీవాలను కల్పించి, అత్యవసర పరిస్థితిని కూడా కొందరు ఆహ్వానించిన కాలంలో అద్దేపల్లి రాసిన పై పాట చాలా ప్రత్యేకతను పొందింది. ఇందిరాగాంధీ అంటే ‘దేశీయ కమ్యూనిజం’ అన్నట్లు ఆమెకు మద్దతు యిచ్చినవారిని ఎద్దేవా చేస్తూ ‘పేదవారికి పెద్దవారికి, భేదమికపై నశిస్తుందని, ఇంద్రజాలంలోన మునిగీ ఎదురు తిరిగే దమ్ములేనపుడు- ఏమి చెయ్యాలేమిచెయ్యాలీ, జనులారమీరు ఇందిరమ్మకు భజనచెయ్యాలి’ అని అద్దేపల్లి గొప్ప వ్యంగ్యవైభవాన్ని ప్రదర్శించాడు. ‘సమాజానికి ఎప్పుడూ వొక పురోగమన వేగముంటుంది. దానితో పాటు పరిగెత్తగలిగినపుడు, అది యౌవనం’ అన్నాడు అద్దేపల్లి. తెలుగు సాహిత్యంపై బలంగా ప్రసరించిన సామాజిక ధోరణుల ప్రభావాల నన్నిటినీ, అవి వస్తు, రూప సంబంధమేదైనా, తనలో నింపుకుని కాలంతోపాటు నడిచి నిత్యయౌవనుడుగా జీవించినవాడు అద్దేపల్లి.

 

దళితులపై సాగుతోన్న దోపిడీ పీడనల్ని ‘మేకల్నే బలిస్తారు’ అనే కవిత ద్వారా వ్యక్తీకరిస్తూ ‘మేకలన్నీ సింహాలై యూపస్తంభాన్నూపే రోజొస్తుంది’ అంటాడు. యూపస్తంభం అంటే యజ్ఞంలో బలిపశువును కట్టివుంచేది. ఇపుడు హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనా విద్యార్థి వేముల రోహిత్‌ను బలిపశువుగా చేసిన అగ్రవర్ణ ఆధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రతిఘటనోద్యమం - పైన అద్దేపల్లి చెప్పిన వాక్యాలై కాలంతోపాటు పరుగిడుతున్నాయి.

 

హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం సాగుతున్న దంతా, హిందువులకూ - హిందూయేతరులకూ; దళితులకూ - దళితేతరులకూ నడుమ సంఘర్షణలాగా చిత్రించాలనీ ఆవిధంగా మైనారిటీలనూ, దళితులనూ ఒంటరిగాళ్ళుగా మిగల్చాలనే ఆధిపత్య వర్గాల ప్రచారమొకటి నడుస్తోంది. హిందుత్వశక్తులు కోరుకునేదిదే. ‘హిందూత్వ’ శక్తుల రాజకీయం హిందూ మతస్తులకోసం కాదనీ, దానికొక వర్గస్వభావముందనీ అద్దేపల్లి ఎప్పుడో గుర్తించాడు.

 

‘హిందూత్వం, అమెరికనిజాన్ని 
నెత్తిన కిరీటంగా పెట్టుకుని 
మైనారిటీ ద్వేషమొక్కటే హిందూత్వమని 
విభిన్నముఖాల మధ్య చెట్లు కూలగొట్టి 
ఎడారుల్ని పరుస్తోంది 

ఓ! హిందూత్వమా! నువ్వు నిజానికి అమెరికనిజానివా?’’

 

అంటూ హిందూత్వవాదుల కుహనా దేశభక్తిని అద్దేపల్లి బట్టబయలు చేశాడు. ‘‘మేకల దారి ఎప్పుడూ ఒక్కటే! సింహాల వేటలో ఒడుపులు మాత్రం అనేకం’’ అంటూ ‘అంబేద్కర్‌ మొదలుపెట్టిన వాక్యాన్ని పూర్తిచేద్దాం’ అంటూ కులనిర్మూలన పిలుపుని కొనసాగించమని అద్దేపల్లి నొక్కి చెప్పాడు. అయితే నిచ్చెనమెట్ల కులవ్యవస్థనీ, శ్రమజీవుల తరతరాల దారిద్రాన్నీ మతంపేరిట, దేవునిసాకున బలపరుస్తున్న హిందూమతాన్ని అడుగడుగునా ఎదుర్కొనకుండా కులనిర్మూలన సాధ్యంకాదని ప్రవచించిన అంబేద్కర్‌ను తమ పూజనీయుడుగా మార్చుకుంటున్నట్లు అడ్డగోలుగా ప్రవర్తించే హిందూత్వ రాజకీయాలది ఆత్మవంచనా, పరవంచన తప్ప మరేమవుతాయి?

 

25 ఏళ్ళ నుండి ఉదార, సరళీకృత ఆర్ధిక సంస్కరణలపేరుతో అమలుజరుగుతున్న సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ద్వారా 2020వ సంవత్సరంనాటికి బంగారు భారతం నిర్మాణమవుతుందనీ, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికే నూతన ఆర్ధిక విధానాలనీ పాలక రాజకీయ పార్టీలూ, ముఠాలూ... వారి ప్రచార బాకాలైన మీడియా, మేధావులూ ఊదరకొట్టారు. కానీ ప్రపంచ, భారతదేశ వ్యాపితంగా సంపద కొద్ది కుటుంబాల వద్దకు చేరి కోట్లాదిగా దరిద్రుల సంఖ్యను పెంచుతోంది. దావోస్‌ (స్విట్జర్లాండ్‌)లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ప్రవేశపెట్టిన నివేదిక పెరుగుతున్న ఆర్ధిక వ్యత్యాసాలను ప్రకటించక తప్పలేదు. 40 వేల కోట్ల రూ. ఆస్తులున్న స్టీఫెన్‌ కెల్లికే అనే సంపన్నుడే భారీ వ్యాపారాలున్న కొద్దిమందికి మాత్రమే ఆ సదస్సులో స్థానం దక్కినందుకు నిరసనగా దాన్ని బహిష్కరించాడు. అంతకంటే ప్రపంచ సంపద కేంద్రీకరణ తీరుకి నిదర్శనమేమి కావాలి? 2010లో ప్రపంచ జనాభాలో సగంమంది సంపదకు సమానమైనది 388 మంది కుబేరుల దగ్గర పోగుపడి వుంటే, మరుసటి సంవత్సరం 177 మంది ప్రస్తుతం కేవలం 62 మంది వద్దా అది పోగుపడింది. అదే భారతదేశంలో కూడా 2014లో ఒక్క బిలియన్‌ డాలర్ల (6800 కోట్ల రూపాయల) సంపన్నులు 61 మంది నుండి ఒక్క సంవత్సరంలో వారు 100 మందిదాకా పెరిగారు. ఇదే కాలంలో ఈలాంటి సంపన్నులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన రాయితీలు 5 లక్షల కోట్ల రూపాయలు. ఇవన్నీ ప్రపంచీకరణ విషఫలితాలే. ఈలాంటి సామ్రాజ్యవాద ప్రపంచీకరణను ప్రధానంగా సాంస్కృతిక కోణం నుండి అద్దేపల్లి తీవ్రంగా గర్హిస్తూ ప్రశ్నిస్తూ గత 20 ఏళ్ళుగా రాసి, ప్రసంగించారు.

 

‘దేశమంటే నల్లమట్టికాదోయ్‌, దేశమంటే తెల్లమనుషులోయ్‌’ అనీ ‘పాలకులు పరదేశాల పాలేర్లుగా మారారనీ’ వాడు ‘చెట్టుకింద నుంచి నేలను లాగేస్తున్నాడనీ’ హెచ్చరికలు చేసిన అద్దేపల్లి ‘యుద్ధం చెయ్యడానికి, జాతి వెన్నెముకని ఖడ్గంగా మారుస్తున్నాను. మట్టిలో వేళ్ళని దేశమంత లోతుగా పాతిపెడుతున్నాను’ అన్నారు.

 

సామ్రాజ్యవాదయుగంలో, ప్రపంచీకరణకాలంలో, అద్దేపల్లి ప్రకారం ‘ప్రాణమయమైన అక్షరాన్ని, ప్రాణాలులేని యంత్రాలు వేటాడతై’ ‘పెద్ద పెద్దవాళ్ళ పండగ సందేశాలన్నీ తెలుగు కత్తితో ఇంగ్లీషునీ, ఇంగ్లీషు కత్తితో తెలుగునీ ఖూనీచేస్తూ వుంటై’. అంతేకాదు ‘వాడి భాషామంత్రాక్షరాలతో ఇక్కడి పాలకులందర్నీ హిప్నటైజ్‌ చేసి తన మొక్కను పెంచే సమర్ధతనిస్తున్నాడు’. ఆ మొక్క పేరు ఇంగ్లీషు భాష.

 

సామ్రాజ్యవాదుల పెదపాలేర్లయిన మన పాలకులకు భక్తి ప్రపత్తు లెక్కువై, యజమానులు కూడా చిరాకుపడే విద్యావిధానాలను అనుసరించి, ఇంగ్లీషు వ్యామోహాన్ని పెంచి యిటు తెలుగు రాని అటు ఇంగ్లీషు కూడా రాని చదువులు నేర్పిస్తున్నారు. మాతృభాషా హంతకులై నారు. తెలుగుద్వేష పాలకులైనారు. వీరి తయారీలో ఇంజనీర్లయిన వారిలో నూటికి ఎనభైమంది తమకూ, తమ కుటుంబానికీ, సమాజానికీ పనికిరాని వాళ్ళయినారు.

 

లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంవారు ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమల్లో 233 పాఠశాలల్లోని విద్యార్థుల పరిజ్ఞానాన్ని కొన్ని సంవత్సరాలు పరిశోధించి తెలుగు మాధ్యమంలో చదువుకునే విద్యార్థులు ఇతర అంశాలేకాక ఇంగ్లీషు నైపుణ్యం కూడా ఎక్కువ సాధించగలుగుతున్నారని నిర్ధారించారు. యజమానులు చెప్పుదెబ్బలు కొట్టినా వీడని బానిసభక్తి మన పాలకులది. పరాయి భాషామాధ్యమంలో చదువులు ఆశాసీ్త్రయమని మనం గత 25 ఏళ్ళకుపైగా బల్లగుద్ది చెబుతున్నదానినే యిపుడు ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంవారు నిర్ధారించారు. ఇంగ్లీషు భాషతో వ్యాపారంచేసి కోట్లకు కోట్లు గడించే అవకాశాలను మన పాలకులు అంత తేలికగా వదులుకుంటారని నమ్మలేం!

మాతృభాషలు దెబ్బతిని కునారిల్లే పరిస్థితులపట్ల ఆవేదన చెందే వారినుద్దేశించి అద్దేపల్లి వ్యంగ్యంగా ‘‘వీడొకడు! మాతృభాష, మాతృభాష అంటాడు. తుపానుకి గునపాలు కొట్టుకు పోతుంటే గడ్డిపరకలు ఏడుస్తున్నట్లుంది’’ అన్నారు. దీని తాత్సర్యమేమంటే సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు చరమగీతం పాడకుంటే దేశానికీ, వివిధ జాతుల ప్రజలకూ వారి భాషలకూ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలూ, విముక్తీలేవు. అలాగే అద్దేపల్లి ఆశకు, పొగచూరిన ఆకాశానికి శాంతీలేదు. మనది సర్వసత్తాక లౌకిక గణతంత్ర సమతారాజ్యమని చెప్పుకోవటానికి అర్హతా లేదు.