అన్నార్తుల ఆర్తనాదం------రచన - డా. శ్యామలగడ్డం....
---------------------------------------------------------
తెలంగాణా రైతన్నల జీవితాలు
తెలంగాణా భూముల్లాగనే నెఱ్ఱెలు బాసినయ్
------అతను----
అన్నం మెతుకు కరువయ్యే రోజొస్తుందని
ఊహించి ఉండడు...
పంచి పెట్టడమే తప్ప దాచి పెట్టడం తెలియనివాడు
కాయకష్టాన్ని కర్తవ్యంగా భావించిన వాడు
చెమటని చినుకులుగా రాల్చి దుక్కి దున్నేవాడు
శ్రమశక్తినే శిస్తుగా కట్టేవాడు
కరువు కాటకాన్ని కంటకంగా యేరి పారేసేవాడు
బుక్కెడు బువ్వకోసం రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవాడు
ప్రపంచీకరణ వామనుని పాదంలా భూమిని తొక్కిపారేస్తున్నప్పుడు
సామాన్యుని బతుకు చిత్రం ఛిద్రమైతుంటే
రైతన్న పంటపొలానికి , ఉన్నఊరికీ
పరాయీకరణ చెందుతున్నప్పుడు
పరాయివాడు భారత దేశపు గుండెపై కూర్చున్నప్పుడు
భవిష్యత్తులో అన్నం పెట్టే రైతన్న
ఒక్కడంటే ఒక్కడు కూడా కనపడడు
తినడానికి బియ్యంగింజ దొరకనప్పుడు
ధనం రాసులుగా పోగేసుసుకున్నా
కడుపులు పేదవైనప్పుడు
అప్పుడు....అప్పుడు...
నీవు బతుకు మూల్యం చెల్లించుకోక తప్పదు
ఆత్మహత్యలకు ఎక్స్గ్ గ్రేషియా పెంచడం కాదు
ఆపాలి రైైతులఆత్మహత్యలు
విదేశాల పెట్టుబడులు కాదు
మనదేశ పెట్టుబడి మాయమైతుందని తెలుసుకో!
సస్యశ్యామల భూములు బీడువారుతున్నప్పుడు
ప్లాట్లుగా ఫ్లాట్లుగా కొత్తరూపం సంతరించుకొన్నప్పుడు
భారతీయ ఆత్మను అమ్ముకుంటున్నప్పుడు
వందే మాతర గీతం వరుస మారిపోతుంది
సుజలాం, సుఫలాం, మలయజ శీతలాలు లేవు
ఉన్నది ఒకే ఒక్కటి ఆకలి, ఆకలి, ఆకలి.........
డా. శ్యామలగడ్డం...20-01-2016...