Thursday, 13 October 2016

6. బడబాగ్నిని...ఉంటుందీ....13-10-2016....

గజల్ పూరణం...12....రచన .. డా. శ్యామలగడ్డం....13-10-2016....

బడబాగ్నిని దాచుకోని సంద్రమెచట ఉంటుందీ
వేదనలను దాచుకోని అబల ఎచట ఉంటుందీ

మరీచికలొ మంచి నీటి చెలమ వెతక ప్రయాసయే
దుష్టబుద్ధి తరచిచూడ ప్రేమ ఎచట ఉంటుందీ

బ్రహ్మ రాయు  రాతలోన మర్మమేమొ తెలియదులే
లక్ష్మి తోడ సరస్వతియె కలయికెచట ఉంటుందీ

చుక్కలన్ని పక్కలుగా మారినవీ ఈవేళా
చక్కనైన చందమామ రాక ఎచట ఉంటుందీ

గున్నమావి గుబురులోన దాగి పోయె కోయిలొకటి
శ్యామ గీతానికి కరగని హృది ఎచట ఉంటుందీ...

డా. శ్యామలగడ్డం....13-10-2016...

Friday, 7 October 2016

11. రాదోమరి..గజల్ 07-10-2016

గజల్ పూరణం
++++++++±±

శరత్కాల మేఘములో వెలుగెందుకు రాదోమరి
శిశిరములో పాదపమున ఆకెందుకు రాదోమరి

వసంతుడే తోడుండగ చిగురేయుట నిజమే మరి
వాసంత సమీరమే చల్లగెందుకు రాదోమరి

హేమంతపు గాలులలో ప్రేమ లేమొ మిళితమాయె
పచ్చదనపు తోటలలో మంచెందుకు రాదోమరి

గ్రీష్మతాపమోపలేక జంటలేమో విడివడగా
తాపమంత తీర్చగాను చినుకెందుకు రాదోమరి

వర్ష ఋతువు జాలిచూపె అవనిపైన ఓ శ్యామా
అలసినయెదలకు రాతిరి కునుకెందుకు రాదోమరి....

డా. శ్యామలగడ్డం....7-10-2016..

Wednesday, 5 October 2016

కవిత..23..ఓటు..

ఓటు
-------

ఓటంటే   మాట  కాదు

ఓటంటే  నోటు  కాదు

ఓటంటే  పాట  కాకూడదు

ఓటంటే  కులాల కుమ్ములాటలసలే  కాదు

ఓటంటే   చేతివాటం   కాదు

ఓటంటే  లీటరు  సారా   కాదు

వేటు కావాలి  సమాజంలోని దుర్మార్గంపై ఓటు

మనిషంటే మారేవాడు

మనిషంటే  మార్పు కోరేవాడు

మనషంటే  మనీ  కోరేవాడు  కాదు

మనిషంటే  మంది మంచి కోరేవాడు

మనిషంటే  మట్టి  కాదు  చైతన్యం

అలాంటి మనిషి కోరేదే సభ్య సమాజం

అలాంటి సమాజం కావాలి దేశ భవిష్యత్తుకు బాట

అలాంటి మనిషి వేసేదే నిజమైన ఓటు----

డా. జి. శ్యామల-------30-09-2015
-----------------------------------------

కవిత..పోటీ ఆలుమగలు

Syamala Gaddam .(తృతీయం)
ఆలుమగలు ఒక్కటైతే ఆనందం
ఆరునెలల సావాసం వారువీరవుతారు (అలవాట్లలో) ఖాయం.
పిల్ల పాపలతో కళకళలాడే ఇల్లు శాంతినివాసం,..
అత్తమామలపై నీ గౌరవం, ఇచ్చును నీకే ఒక వరం
ఆడుబిడ్డలు ఆడేరు పరిహాసం...
శరదేందు చంద్రికల బోలిన నీ దరహాసం
తెలుపును సమ్మిళిత భావాల సమాహారం..
కోపమైనా, తాపమైనా, తీర్చును ఆ మందహాసం
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే తత్వం
ఎగురవేయును కీర్తి పతాకం..
దైవ సన్నిధిలో మనసు ప్రశాంతం
తీయును నీకై మోక్షద్వారం...

కృష్ణాతరంగాలులోని  పదవిన్యాస కవితలపోటీ కవిత.......

కవిత20--దీపావళి..

. దీపావళి
-------------------
దీపావళి సర్వ జనావళికి సమ్మోదమైన వేళ
నగరమంతా వెలుగులతో సమ్మోహనమైన వేళ
నరకాసుర దమనకాండ ముగిసిన వేళ
రావణాసురుని రాక్షసత్వం ఉడిగిన వేళ
కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మం నిలిచిన వేళ
బలి చక్రవర్తి అహంకారం అణగారిన వేళ
ఆరోజే ఆనందోత్సాహాల దీపావళి!!!
క్షీరసాగర మధనంలో ఆదిలక్ష్మి అవతరించిన వేళ
విను వీధిలో సురోత్తములు సంతసమందిన వేళ
ఆ రోజే ఆనంద దీపావళి!!!
ఆనంద దీపావళి!!!
పెద్దలంతా పిల్లలుగా మారేవేళ
కన్నెల కన్నుల్లో కమనీయ కాంతులు మతాబుల్లా వెలిగిన వేళ
వృధ్ధుల వదనాలు తారాజువ్వలుగా మెరిసిన వేళ
యువకుల హృదయాలు లక్ష్మీబాంబులామారిన వేళ
ఇల్లాళ్ళ హృదయకమలాలు చిచ్చుబుడ్లలా విచ్చుకున్న వేళ
ఆ రోజే దీపావళి-- ఆరోజే దీపావళి!!!
ఉత్తుంగ తరంగాల్లా ఎగసిపడుతున్న ఆనందార్ణవ దీపావళి!!!
డా. జి. శ్యామల-------------13-09-2015 ( కవిత రాసినది-----2012

దీపావళి సందర్భంగా  ఈ నా కవితను మళ్ళీ పోస్టు చేస్తున్నాను...11-11-2015

డా. శ్యామల గడ్డం...

కవిత --17.. తెలంగాణ రాతన్న

అన్నార్తుల ఆర్తనాదం------రచన - డా. శ్యామలగడ్డం....
---------------------------------------------------------

తెలంగాణా రైతన్నల జీవితాలు
తెలంగాణా భూముల్లాగనే నెఱ్ఱెలు బాసినయ్

------అతను----

అన్నం మెతుకు కరువయ్యే రోజొస్తుందని
ఊహించి ఉండడు...

పంచి పెట్టడమే తప్ప దాచి పెట్టడం తెలియనివాడు

కాయకష్టాన్ని కర్తవ్యంగా భావించిన వాడు

చెమటని చినుకులుగా రాల్చి దుక్కి దున్నేవాడు

శ్రమశక్తినే శిస్తుగా కట్టేవాడు

కరువు కాటకాన్ని కంటకంగా యేరి పారేసేవాడు

బుక్కెడు బువ్వకోసం రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవాడు

ప్రపంచీకరణ వామనుని పాదంలా భూమిని  తొక్కిపారేస్తున్నప్పుడు

సామాన్యుని బతుకు చిత్రం ఛిద్రమైతుంటే

రైతన్న పంటపొలానికి , ఉన్నఊరికీ

పరాయీకరణ చెందుతున్నప్పుడు

పరాయివాడు భారత దేశపు గుండెపై కూర్చున్నప్పుడు

భవిష్యత్తులో అన్నం పెట్టే రైతన్న

ఒక్కడంటే ఒక్కడు కూడా కనపడడు

తినడానికి బియ్యంగింజ దొరకనప్పుడు

ధనం రాసులుగా పోగేసుసుకున్నా

కడుపులు పేదవైనప్పుడు

అప్పుడు....అప్పుడు...

నీవు బతుకు మూల్యం చెల్లించుకోక తప్పదు

ఆత్మహత్యలకు ఎక్స్గ్ గ్రేషియా పెంచడం కాదు

ఆపాలి రైైతులఆత్మహత్యలు

విదేశాల పెట్టుబడులు కాదు

మనదేశ పెట్టుబడి మాయమైతుందని తెలుసుకో!

సస్యశ్యామల భూములు బీడువారుతున్నప్పుడు

ప్లాట్లుగా ఫ్లాట్లుగా కొత్తరూపం సంతరించుకొన్నప్పుడు

భారతీయ ఆత్మను అమ్ముకుంటున్నప్పుడు

వందే మాతర గీతం వరుస మారిపోతుంది

సుజలాం, సుఫలాం, మలయజ శీతలాలు లేవు

ఉన్నది ఒకే ఒక్కటి  ఆకలి, ఆకలి, ఆకలి.........

డా. శ్యామలగడ్డం...20-01-2016...

10. గజల్..సమయమిదే..05-03-2016

.

మనసులోని భావాలను పలికించిన సమయమిదే

కనులతోడ స్నేహరసము కురిపించిన సమయమిదే

కాచుకున్నపందాలూ , వేసుకున్న పరదాలూ
తొలగిపోయి త్వరత్వరగ, కలసిపొయిన సమయమిదే

ఆటలాడి, పాటపాడి మనసుదోచుకున్నహాయి
మరల,మరల తలచుకొనీ,  పలికించిన సమయమిదే

చదువులలో పోటీలు, సెల్ఫీలలొ పోటీలు
సినిమాలకు, షికార్లకూ పరుగెత్తిన సమయమిదే

కాలమేమొ దౌడుతీయ పెంచుకున్న బంధాలు
త్రంచుకోను మనసురాక బిడియపడిన సమయమిదే

వెక్కిరింత, కొక్కిరింత, ఆప్యాయత, అనురాగం
ముప్పిరిగొన గడచిపోయి ,విడిపోయిన సమయమిదే

బాధ్యతలే లేని వయసు, చింతలేమి లేని మనసు
ఊహలకే రెక్కలిచ్చి  పయనించిన సమయమిదే...

డా.శ్యామలగడ్డం.... 5-03-2016...

కవిత...16..గడియారం స్మృతి గీతం...

.గడియారం శేష ఫణిశర్మ గారికి ఏకలవ్య శిష్యురాలిని అయిన నేను వారు పరలోకగతులయినప్పుడు వారి గురించి రాసిన స్మృతిగీత కవిత....

గడియారం ఆగిపోయింది
-----------------------------
నేస్తం-----వినిపించింది వేణుగానం, నీ కవితామాధుర్యంతో
పలికించింది నా యెడద తేటగీతులను నీ పద్య కవితా వైభవంతో
కురిపించింది నా మది సదనం, మల్లెలవాన నీ కవితా ప్రౌఢిమతో
కృష్ణశాస్త్రి పదలాలిత్యం, కృష్ణదేవరాయల కవిత్వం, శ్రీనాథుని పాండిత్యం
రంగరించిన పాకమదేమో నీ కవిత్వమయ్యింది
వార్ధక్యం లెక్కచేయక, పట్టువిడువక, కవితా ప్రతిభ సడలక
నీవు రాసిన పద్యప్రబంధం, ప్రధమ బహుమతి గెలుచుకున్నప్పుడు
నాకు కలిగిన అంబరాన్నంటిన సంబరం, ఆ మర్నాడే క్షణాల్లో ఆవిరయ్యింది,

దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ నీవు అమరపురికి చేరావన్న వార్తతో
అభినదనలు అందుకోకుండానే , అందరాని లోకాలకు వెళ్ళావన్న కబురుతో
మనసు కన్నీరై ప్రవహించింది,విషాదగీతికలను పలికించింది
ఏం చేస్తున్నావక్కడ ?
శ్రీనాధునితో సీసపద్యాల పోటీ పెట్టుకున్నావా!
అష్టదిగ్గజాలతో ఆశుకవిత్వపు ఆటలాడుతున్నావా!
పెద్దన్నతో పద్యం పందెం కాస్తున్నావా!
క-ష్ణదేవరాయలకీర్తికి చెక్పెట్టాలని చూస్తున్నావా!!!
కృష్ణశాస్త్రి భావవాహినిలో కరిగిపోయావా!
ఏమైనా నేస్తం!
మూగబోయిన నా కవితా కళికను వికసింప చేసే శక్తి
మరెవ్వరికుంది  నీకుతప్ప?

(పెద్దలు, స్నేహితులు గడియారం శేషఫణిశర్మ గాగికి ఈ స్మృతి కవిత అంకితం)

డా,జి, శ్యామల-------------
------------------

కవిత--14--కాగితం..

మనసులోని కష్టాలకు సుఖాలకు నేస్తం కాగితం
ఉల్లాసం ఉద్వేగం, ఆవేశం ఆక్రోశం దేన్నీ కాదనదు కాగితం
స్వఛ్ఛంగా, మల్లెలా, తెల్లగా ఉండే కాగితం
తనని మలినంచేసినా, సహనంతో ఉంటుంది
పిచ్చిగీతలు గీసినా సౌశీల్యం గల స్త్రీలా ఓర్పు వహిస్తుంది
అదే కాగితం తనని వాడుకున్న కొందరిని అందలమెక్కిస్తుంది
రాజగౌరవాన్నికల్పిస్తుంది
విషయం లేకుండా తనని నింపే విద్యార్ధుల పట్ల కూడా
ఉదారంగా వ్యవహరిస్తుంది
అవసరం తీరిన తరువాత కృతఘ్నుల్లా వీధిలోకి గిరాటు వేసినా
చెత్త కాగితాలవారికిచ్చేసినా, చిత్తు కాగితనమని చించేసినా
నోరు విప్పదు కాగితం
ఎవరూ లేని అనాధపిల్లలకు ఆసరా అవుతుంది కాగితం
ప్రియుడికి ప్రియురాలికి ప్రేమ సందేశాన్నందిస్తుంది
వారి ప్రేమను ఆ కాసేపూ తానూ పొందుతుంది
గాల్లోకి ఎగిరి, చెట్టు కొమ్మలెక్కి ,చినుకుల్లో తడిసి
గాలిపటమై,ఊరూరా సంచరిస్తూ, ప్రపంచాన్ని పలకరిస్తూ
అన్నీ తానే అనుకునే పిచ్చిపిల్ల కాగితం.........

డా. జి. శ్యామల---------23-6-2015

కవిత-13--బాల్యం

కవిత--12 తెలిమంచు

30-06-2015
తెలిమంచు కురిసేటి ఉషోదయవేళ,
వెలుగు రెక్కలు విప్పుకుని సవిత తమోపహరణం చేసేటివేళ
హిమం కరిగి నీరయ్యేటివేళ
తిమిరాన్ని సమయించి  బాలభానుడు ఉదయించేటివేళ
విరిసిన కమలం సంతసించేటివేళ
తొలినాటి తలపునే తలచుకున్నాను
మలినాటి వలపునే వినిపించినాను
యెదలోని మధురిమను మరి చేర్చినాను
ఇన్నాళ్ళ నా తపము ఫలియించెనదిగో

కొమ్మ కొమ్మకీ కబురే చేశా
కోయిలమ్మనీ కలిసే వచ్చా
రామ చిలుకనీ పిలిచే అడిగా,,నెలరాజు యేడనీ
విహాయసంలో విహంగమై కొండలు కోనలు అన్నీ దాటా
వాగులు వంకలు అన్నీ చూసా దిక్కులన్నిటిలో దివిటీలేసా
నీ జాడ తెలియక ఉసురుసురన్నా

నీ ఇంటి ముంగిట రంగవల్లినై కొలువు తీరుతా
నీ దేవుడింట దీపాన్నై వెలుగొందుతాను
నీ కనులకు స్వప్నాన్నై కదలాడతాను
నీ మాట పూబాట అని నమ్ముతాను

డా. జి. శ్యామల----

కవిత--7

అమరజీవి అబ్దుల్ కలామ్
-------------------------------

అకుంఠితదీక్షాపరుడు, అంతరిక్షపరిశోధనారధసారధి

అందరాని లోకాలకు వెళ్ళడం

అఖండభారతావనికి తీరనిశోకం

యువతకు ఆశాజ్యోతి, 
భవితకు దిక్సూచి

నవతకు నిర్మాణశక్తి
నడవడికకు నిదర్శనం

సద్గుణాలకు స్వరూపం
సంయమనశీలి

విజ్ఞాన భాండాగారం
అజ్ఞాన తిమిరాలను
పారద్రోలే ప్రచండ
సూర్యకిరణం

శాంతి కాముకత్వం అతని మార్గం
అనితర సాధ్యం

బాలబాలికలపై ప్రేమచూపే కరుణామయుడు
నిరాడంబరత, నిస్వార్ధం
అతని ఆస్తి

ఓ కలాం గారూ...
వ్యాపించింది మీ కీర్తి దిగంతాలు
దివంగతులైన మీకు గులాముగా
భారతావని చేస్తున్నది సలాము

కలాం గారిపై నిండైన అభిమానంతో  అశ్రుధారలతో...........డా. జి. శ్యామల.......

పాట..1...

మేలుకో  యువతా మేలుకో   ---        పాట

----------------------------------- -------------- 

మేలుకో యువతా మేలుకో

మైలురాయినే నువ్వు చేరుకో---------మేలుకో-------

--1 అడ్డదారి కాదు నీది --  రహదారినె ఎన్నుకో

పెడత్రోవన పడకుండా- -  - లక్ష్యాన్నే కోరుకో   -----మేలుకో --

2  అమ్మాయితొ జల్సాలు - ఆరోగ్యానికి  ముప్పు

అది తెలిసి నువ్వు-  జాగ్రత్తగ  మసలుకో   ---మేలుకో---

3. ర్యాగింగు కాదు నీకు - జాగింగే కావాలి

జీవితమే నీదిగా --  నేర్పరివై   సాగిపో   ---  మేలుకో --

అంతర్జాతీయ యువదినోత్సవ సందర్భంగా   మా కళాశాలలో  ఈరోజు  అప్పుడే రాసి పాడిన పాట

12-08-15,------ డా. జి. శ్యామల-------

కవిత--5..

12-09-2015--
----------------
గోదావరి
----------

గల గలా పారింది గోదావరి
జల జలా ప్రవహించె గోదావరి

వెల్లువలా సాగింది గోగావరి
పొంగుతూ  పొర్లింది గోదావరి

కృష్ణమ్మ ఒడి చేరె
కష్ట ఫలితమై వచ్చింది గోదావరి

తాడిపత్రిపై  వచ్చింది గోదావరి
కష్టజీవులను కరుణించి వచ్చింది గోదావరి

పావన గంగగా వచ్చింది గోదావరి
వంకర్లు తిరుగుతూ వచ్చింది గోదావరి

నేలతల్లినీ తడపంగ వచ్చింది గోదావరి
పంటలను పండించ వచ్చింది గోదావరి...........డా. జి. శ్యామల.......

Tuesday, 4 October 2016

కవిత .... తెలుసు...నింగి అంచునున్న...

నింగి అంచునున్న నీటిచుక్కకు తెలుసు
తాను ఎప్పుడు వానచినుకై కురవాలో

కడలి మాటునున్న నీటిబిందువుకు తెలుసు
ఒడ్డులొరుసుకుని నేలతల్లిని ఎప్పుడు తడపాలో

విత్తుకు తెలుసు చిత్తడినేలపై  ఎలా మొలకెత్తాలో
మొలకెత్తిన మొక్కకు తెలుసు వృక్షంగా ఎలా ఎదగాలో

పక్షులకు తెలుసు ఎదగని బిడ్డలకు ఆహారాన్నెలా ఇవ్వాలో
కాకులకు తెలుసు  సానుభూతి ఎలా చూపాలో

రవిబింబానికి తెలుసు అరుణకాంతులతో ఎలా వెలుగివ్వాలో
జాబిల్లికి చల్లని   వెన్నలని  భూమికి ఎలా పంచాలో

గాలికి తెలుసు చిరుగాలి సవ్వడిగా ఎలా మారాలో
నిప్పుకు తెలుసు పొయ్యి కింద మంటగా ఎలా కావాలో

కమలానికి తెలుసు తన బాంధవుడు రాగానే ఎలా విచ్చుకోవాలో
కలువభామకు తెలుసు చంద్రోదయాన్నే ఎలా నవ్వుతూ పువ్వవ్వాలో

ప్రకృతికి వర్తించిన నియమావళి
, మనిషికెందుకు లేకుండా పోతుంది......

తానిష్టమొచ్చినట్లు ఎందుకు నర్తిస్తున్నాడు....
స్వార్ధపరుడిగా మారి మృగంలా ప్రవర్తిస్తున్నాడు....

ఓ మనిషీ....నీ అంతరంగ గవాక్షంలోకి తొంగి చూసుకో ఒక్కసారి...
మనిషిగా నీవు చేస్తున్న చేతలను లెక్కించుకో....
అన్యాయాన్ని చూస్తున్నవాడే చెప్పలేని కాలం ఇది

పంచభూతాలు సాక్షీభూతాలు కాలేవు
వాటిని కూడా నీ చెప్పుచేతల్లోకి తీసుకోవాలనుకోకు
తొక్కేస్తుంది నీ దురహంకారం  అధః పాతాళానికి

మనిషిలో మనిషితనం మాయమవుతున్న తరుణంలో
యే బుధ్ధుడో, రాముడో, కృష్ణుడో, అల్లాయో. క్రీస్తో ,
దిగిరాడు ఈ కలికాలంలో....

మేల్కొల్పాలి మనిషిలోని మానవత్వాన్ని మరో మనిషే,
తరిమెయ్యాలి అంధకారపు అహంకారపు పొరల్ని
మనిషే మహర్షి అవ్వాల్సిన రోజొచ్చింది
ఉంది మంచి మనిషి చేతుల్లోనే
మరో మనిషి  మనుగడ.........-----------డా.శ్యామల గడ్డం---04-10-2015

----------------------------------