Wednesday, 5 October 2016

కవిత...16..గడియారం స్మృతి గీతం...

.గడియారం శేష ఫణిశర్మ గారికి ఏకలవ్య శిష్యురాలిని అయిన నేను వారు పరలోకగతులయినప్పుడు వారి గురించి రాసిన స్మృతిగీత కవిత....

గడియారం ఆగిపోయింది
-----------------------------
నేస్తం-----వినిపించింది వేణుగానం, నీ కవితామాధుర్యంతో
పలికించింది నా యెడద తేటగీతులను నీ పద్య కవితా వైభవంతో
కురిపించింది నా మది సదనం, మల్లెలవాన నీ కవితా ప్రౌఢిమతో
కృష్ణశాస్త్రి పదలాలిత్యం, కృష్ణదేవరాయల కవిత్వం, శ్రీనాథుని పాండిత్యం
రంగరించిన పాకమదేమో నీ కవిత్వమయ్యింది
వార్ధక్యం లెక్కచేయక, పట్టువిడువక, కవితా ప్రతిభ సడలక
నీవు రాసిన పద్యప్రబంధం, ప్రధమ బహుమతి గెలుచుకున్నప్పుడు
నాకు కలిగిన అంబరాన్నంటిన సంబరం, ఆ మర్నాడే క్షణాల్లో ఆవిరయ్యింది,

దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ నీవు అమరపురికి చేరావన్న వార్తతో
అభినదనలు అందుకోకుండానే , అందరాని లోకాలకు వెళ్ళావన్న కబురుతో
మనసు కన్నీరై ప్రవహించింది,విషాదగీతికలను పలికించింది
ఏం చేస్తున్నావక్కడ ?
శ్రీనాధునితో సీసపద్యాల పోటీ పెట్టుకున్నావా!
అష్టదిగ్గజాలతో ఆశుకవిత్వపు ఆటలాడుతున్నావా!
పెద్దన్నతో పద్యం పందెం కాస్తున్నావా!
క-ష్ణదేవరాయలకీర్తికి చెక్పెట్టాలని చూస్తున్నావా!!!
కృష్ణశాస్త్రి భావవాహినిలో కరిగిపోయావా!
ఏమైనా నేస్తం!
మూగబోయిన నా కవితా కళికను వికసింప చేసే శక్తి
మరెవ్వరికుంది  నీకుతప్ప?

(పెద్దలు, స్నేహితులు గడియారం శేషఫణిశర్మ గాగికి ఈ స్మృతి కవిత అంకితం)

డా,జి, శ్యామల-------------
------------------

No comments:

Post a Comment