Tuesday, 4 October 2016

కవిత .... తెలుసు...నింగి అంచునున్న...

నింగి అంచునున్న నీటిచుక్కకు తెలుసు
తాను ఎప్పుడు వానచినుకై కురవాలో

కడలి మాటునున్న నీటిబిందువుకు తెలుసు
ఒడ్డులొరుసుకుని నేలతల్లిని ఎప్పుడు తడపాలో

విత్తుకు తెలుసు చిత్తడినేలపై  ఎలా మొలకెత్తాలో
మొలకెత్తిన మొక్కకు తెలుసు వృక్షంగా ఎలా ఎదగాలో

పక్షులకు తెలుసు ఎదగని బిడ్డలకు ఆహారాన్నెలా ఇవ్వాలో
కాకులకు తెలుసు  సానుభూతి ఎలా చూపాలో

రవిబింబానికి తెలుసు అరుణకాంతులతో ఎలా వెలుగివ్వాలో
జాబిల్లికి చల్లని   వెన్నలని  భూమికి ఎలా పంచాలో

గాలికి తెలుసు చిరుగాలి సవ్వడిగా ఎలా మారాలో
నిప్పుకు తెలుసు పొయ్యి కింద మంటగా ఎలా కావాలో

కమలానికి తెలుసు తన బాంధవుడు రాగానే ఎలా విచ్చుకోవాలో
కలువభామకు తెలుసు చంద్రోదయాన్నే ఎలా నవ్వుతూ పువ్వవ్వాలో

ప్రకృతికి వర్తించిన నియమావళి
, మనిషికెందుకు లేకుండా పోతుంది......

తానిష్టమొచ్చినట్లు ఎందుకు నర్తిస్తున్నాడు....
స్వార్ధపరుడిగా మారి మృగంలా ప్రవర్తిస్తున్నాడు....

ఓ మనిషీ....నీ అంతరంగ గవాక్షంలోకి తొంగి చూసుకో ఒక్కసారి...
మనిషిగా నీవు చేస్తున్న చేతలను లెక్కించుకో....
అన్యాయాన్ని చూస్తున్నవాడే చెప్పలేని కాలం ఇది

పంచభూతాలు సాక్షీభూతాలు కాలేవు
వాటిని కూడా నీ చెప్పుచేతల్లోకి తీసుకోవాలనుకోకు
తొక్కేస్తుంది నీ దురహంకారం  అధః పాతాళానికి

మనిషిలో మనిషితనం మాయమవుతున్న తరుణంలో
యే బుధ్ధుడో, రాముడో, కృష్ణుడో, అల్లాయో. క్రీస్తో ,
దిగిరాడు ఈ కలికాలంలో....

మేల్కొల్పాలి మనిషిలోని మానవత్వాన్ని మరో మనిషే,
తరిమెయ్యాలి అంధకారపు అహంకారపు పొరల్ని
మనిషే మహర్షి అవ్వాల్సిన రోజొచ్చింది
ఉంది మంచి మనిషి చేతుల్లోనే
మరో మనిషి  మనుగడ.........-----------డా.శ్యామల గడ్డం---04-10-2015

----------------------------------

No comments:

Post a Comment