ఒక అందమైన పొయమ్ అంటె....
ఒక గుండె ఉండాలి
అది కన్నీళ్ళు కార్చాలి
క్రోధాగ్నులు పుక్కిలించాలి…
ఆధునిక తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడిని సృష్టించిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ. ఆధునిక కవిత్వానికి ఒక గొప్ప సౌందర్యాత్మకత్వాన్ని కల్పించి,అటు సంప్రదాయాన్ని, ఇటు ప్రగతి శీలతనీ, అటు ప్రాచీన భారతీయ అలంకార శాస్త్రాన్నీ, ఇటు ఆధునిక కాలంలోని మార్క్సిజాన్ని కలగలిపి ఒక నూతన అపురూప సాహిత్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఒక మహత్ప్రయత్నాన్ని చేసిన కవి శేషేంద్రశర్మ. యాభైకి పైగా కవితలు పండించి రాసులుగా పోసినా ఆయనకు తీరని దాహమే. షోడశి వాల్మీకి రామయణంలోని సుందర కాండకు వినూత్న తాంత్రిక భాష్యం కూర్చారు. హర్షుని నైషధీయ చరితకు తాంత్రిక వ్యాఖ్యానం రాసారు. ఆయన జర్మనీ ఇండోలాజికల్ రిసెర్చ్ యూనివర్సిటీ ఆహ్వానం మీద వెళ్ళి "కాళిదాసు మేఘదూతానికి, వాల్మీకి రామాయణానికి ఉన్న సంబంధం" అనే సిద్ధాంత వ్యాసం సమర్పించారు. కాళిదాసు అకాడమీ వారి ఆహ్వానం పై "ఇద్దరు ఋషులు - ఒక కవి" అనే శీర్షికతో వాల్మీకి, వ్యాస, కాళిదాసుల కవిత్వానుబంధాల మీద పరిశోధన వ్యాసం సమర్పించారు. నాదేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, ఆధునిక మహాభారతం, సముద్రం నా పేరు, శేష జ్యోత్స్న, ఋతుఘోష, కాలరేఖ, కామోత్సవ్, ప్రేమలేఖలు, నా రాష్ట్రం- ఇవి ఆయన రచనలు కొన్నిమాత్రమే..
శేషేంద్ర పుట్టింది నాగరాజుపాడులో. పెరిగిన ఊరు తోటపల్లి,గూడూరు. తండ్రి గుంటూరు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, తల్లి అమ్మాయమ్మ. ఇద్దరూ చదువుకున్నవారే. ఎమ్.బి.బి.యెస్ చదవాలనుకుని బి.ఎ. చేసి లా చదువుతుండగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చి మునిసిపల్ కమీషనర్గా పని చేసాడు. జర్నలిజం మీద ఉన్న మక్కువతో లా చదువుతుండగానే తాపి ధర్మారావుగారి వద్ద కూడా పని చేసాడు. తొలిసారిగా అచ్చయిన రచన ఒక పాట విశాలాంధ్రలో ముద్రించబడింది.
"ఈ ప్రపంచం ఎక్కడున్నా సరే!
ధ్రువములకు మధ్య వలె దూరమైనా సరే!
మన బాధలూ ఒక్కటే,
ఎప్పుడూ మన గాధలూ ఒక్కటే…"
శేషేంద్రశర్మలో ఉన్న ఒక మంచి లక్షణం వినమ్రత. చిన్నవాళ్లైనా, పెద్దవాళ్ళైనా ఎంతో మర్యాదగా, హుందాగా మాట్లాడి, వారిని ప్రోత్సహించి, అభినందించేవాడు. తనకంటే ముందున్న కవులను, తనకంటే జ్ఞాన సంపన్నులను గౌరవిస్తాడు ఆయన. వాళ్లు ఏ మార్గానికి చెందినవారైనా సరే. ఆయన ప్రాచ్యసాహిత్యాన్ని బాగా మధించినవాడు. భారతీయ అలంకారశాస్త్రానికున్న పరిమితులన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండిత లక్షణం శేషేంద్రలో ఉంది. సంస్కృత భాషా, సాహిత్య పరిజ్ఞానం తో బాటు పాశ్చాత్య సాహిత్యాన్ని, ఫ్రెంచి కవిత్వం మొదలు రకరకాల దేశ దేశాల కవిత్వాన్ని ఆయన లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాడు. అనేక భాషల్లొ మాట్లాడగలిగిన ప్రజ్ఞావిశేషం కూడా ఆయనకుంది. పాశ్చాత్య అలంకార లేదా విమర్శ గ్రంధాలకు సంబంధించి గ్రీకు విషాదాంత నాటకాలు దగ్గరనుండి రష్యన్ మార్క్సిస్టు భావజాలంతో నిండిన చాలా పుస్తకాలు చదివి అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వాల్మీకిని, ఉపనిషత్తుల్ని, కాళిదాసుని, గ్రీకు నాటకాల్ని, అరవిందుడిని క్షుణ్ణంగా పరిశీలించిన "కాలరేఖ" వ్యాసాలు అందుకు సాక్ష్యం. అలాగే కవిసేన మేనిఫెస్టోలో ఇచ్చిన ఉదాహరణలు అలవోకగా ఇచ్చాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
ఇక కవిత్వంలో అందమైన ఆదర్శాలు..
ఏమని రాశేవు
నిన్ను గురించి ఓ శేషన్
నీకు నిద్ర అంటే
రాత్రి శయ్యలో చేసే సాహస యాత్ర
నీకు కవిత అంటే
క్రూరజీవన రాస్తాల్లో ప్రవేశించే పాత్ర
నీ రాత్రులు
అక్షరాల్లో పోసే ఘోష
ప్రజానీకాల అభివ్యక్తి హీనభాష
ఈ దేశపు మృత్తికలో చల్లావు నీ హృదయాల్ని
నీ రక్తనాళాలు తడుపుతున్నాయి కాగితాల తీరాల్ని
ఈ దేశం నీకిచ్చిన గాయం
నీకు మాత్రం తృణప్రాయం (ఆధునిక మహాభారతము)
No comments:
Post a Comment